మహిళల క్రికెట్లో సంచలనం నమోదైంది. పసికూన ఐర్లాండ్ తమ టీ20 చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించి, పటిష్టమైన పాకిస్తాన్కు ఊహించని షాకిచ్చింది. ఐర్లాండ్ ట్రై సిరీస్లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో పాక్ నిర్దేశించిన 176 పరుగుల భారీ లక్ష్యాన్ని ఐర్లాండ్ జట్టు మరో 5 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.
ఐర్లాండ్ మహిళల టీ20 క్రికెట్ చరిత్రలో ఇదే అత్యంత భారీ ఛేదనగా (7 వికెట్ల తేడాతో) రికార్డైంది. ఆమీ హంటర్ (56), రెబెకా స్టాకెల్ (60 నాటౌట్) అద్భుతమైన అర్ద సెంచరీలతో ఐర్లాండ్కు ఈ చారిత్రక విజయాన్ని అందించారు. అంతకుముందు మ్యాచ్లో వెస్టిండీస్ చేతిలో పరాభవం ఎదుర్కొన్న ఐరిష్ మహిళలు, ఈ మ్యాచ్లో అనూహ్యంగా పుంజుకొని సంచలన విజయం సాధించారు. మరోవైపు పాక్ దీనికి ముందు మ్యాచ్లో విండీస్ చేతిలో, ఇప్పుడు ఐర్లాండ్ చేతిలో ఓడి నిష్క్రమణకు దగ్గర్లో ఉంది.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. మునీబా అలీ (65) అర్ద సెంచరీతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. మిగతా పాక్ బ్యాటర్లలో గుల్ ఫెరోజా (32), సైరా జబీన్ (36), కెప్టెన్ ఫాతిమా సనా (21) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్ 19.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. అమీ హంటర్, స్టోకెల్ అర్ద సెంచరీలతో రాణించగా.. కెప్టెన్ ఓర్లా ప్రెండర్గాస్ట్ (33) ఓ మోస్తరు స్కోర్తో పర్వాలేదనిపించింది. ఇవాళే జరిగే (జూన్ 1) తదుపరి మ్యాచ్లో ఐర్లాండ్ మరోసారి విండీస్తో తలపడనుంది.


