భారత మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ దేశంలోని అన్ని వేదికల్లోనూ టెస్టులు నిర్వహించా లన్నాడు. ఇటీవల 2026–27 సీజన్కు సంబంధించిన షెడ్యూల్ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) విడుదల చేసింది. ఇందులో విఖ్యాత క్రికెట్ మైదానం ‘ఈడెన్ గార్డెన్స్’ను కాదని ఆస్ట్రేలియాతో టెస్టు కోసం గువాహటి వేదికను ఎంపిక చేసింది.
కోల్కతా వాసులు, క్రికెట్ అభిమానులకు ఇది కంటగింపుగా ఉన్నా.. బోర్డు నిర్ణయాన్ని తాజాగా గంగూలీ సమర్థించాడు. ‘మాజీ క్రికెటర్గా, బెంగాలీగా, క్యాబ్ అధ్యక్షుడిగా ఈడెన్లో ఆ్రస్టేలియా లాంటి గట్టి ప్రత్యర్థితో టెస్టులు జరిగితే చాలా సంతోషిస్తాను. అలాగే ఓ సగటు భారతీయుడిగా దేశంలోని మిగతా వేదికల్లోనూ గొప్పగొప్ప మ్యాచ్లు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా.
కోల్కతాలో దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్ను ఏర్పాటు చేశారు. ఇటీవల టి20 ప్రపంచకప్ మ్యాచ్లు కూడా జరిగాయి. రెగ్యులర్గా ఐపీఎల్ పోటీలకు ఈడెన్ గార్డెన్స్ క్రమం తప్పకుండా ఆతిథ్యమిస్తోంది. ఇక్కడ నిర్వహించడం ఎంత బాగున్నా... మిగతా వేదికలను కూడా పట్టించుకోవడం అంతే ముఖ్యం.
దేశంలోని పలు నగరాల్లోని క్రికెట్ మైదానాలన్నీ బాగున్నాయి. అలాంటపుడు టెస్టుల్ని కేవలం కొన్ని నగరాలకే పరిమితం చేయడం సమంజసం కాదు’ అని దాదా వివరించాడు. గువాహటి, రాంచీ సహా మిగతా నగరాల్లోనూ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లకు దీటైన వేదికల్ని సిద్ధం చేశారని గంగూలీ కితాబిచ్చాడు.
చదవండి: పోరాటానికి పరిమితులెందుకు?


