
ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్) మెన్స్ క్రికెట్ కమిటీ ఛైర్మన్గా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పునర్నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఐసీసీ గ్లోబల్ గవర్నింగ్ బాడీ ఆదివారం (ఏప్రిల్ 13) ప్రకటించింది. గంగూలీ దీర్ఘకాల సహచరుడు వీవీఎస్ లక్ష్మణ్ కూడా ప్యానెల్ సభ్యులలో ఒకరిగా మళ్లీ ఎంపికయ్యారు.
2000 నుండి 2005 వరకు భారత జట్టుకు నాయకత్వం వహించిన గంగూలీ 2021లో తొలిసారి ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ ఛైర్మన్గా ఎంపికయ్యారు. నాటి నుంచి గంగూలీ ఈ పదవిలో కొనసాగుతున్నారు. 52 ఏళ్ల గంగూలీ భారత లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే నుండి ఈ పదవిని స్వీకరించారు. కుంబ్లే గరిష్టంగా అనుమతించబడిన మూడు మూడు సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేసిన తర్వాత పదవీ విరమణ చేశారు.
గంగూలీ, లక్ష్మణ్లతో పాటు కొత్తగా ఏర్పాటు చేయబడిన కమిటీలో ఆఫ్ఘనిస్తాన్ మాజీ ఆటగాడు హమీద్ హసన్, వెస్టిండీస్ బ్యాటింగ్ ఐకాన్ డెస్మండ్ హేన్స్, దక్షిణాఫ్రికా ప్రస్తుత టెస్ట్ మరియు వన్డే జట్టు కెప్టెన్ టెంబా బవుమా, ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ జోనాథన్ ట్రాట్ ఉన్నారు.
మహిళల క్రికెట్ కమిటీ విషయానికొస్తే.. న్యూజిలాండ్ మాజీ ఆఫ్ స్పిన్నర్ కేథరిన్ క్యాంప్బెల్ ఛైర్ పర్సన్గా ఎంపిక కాగా, ఆస్ట్రేలియా మాజీ క్రీడాకారిణి అవ్రిల్ ఫాహే, క్రికెట్ దక్షిణాఫ్రికా ఫోలెట్సి మోసేకి ఇతర సభ్యులుగా ఉన్నారు.
ఆఫ్ఘనిస్తాన్ మహిళా క్రికెటర్ల కోసం ప్రత్యేక టాస్క్ఫోర్స్
అఫ్ఘనిస్తాన్ మహిళా క్రికెటర్ల భవితవ్యంపై ఐసీసీ కీలక చర్య తీసుకుంది. తాలిబన్ల పాలన ప్రారంభమైన తర్వాత తీవ్రంగా ప్రభావితమైన ఆఫ్ఘనిస్తాన్ మహిళా క్రికెట్కు పునరుజ్జీవనం కలిగించేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది.
తాలిబన్ పరిపాలనలో మహిళలు క్రీడల్లో పాల్గొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కొందరు ఆఫ్ఘనిస్తాన్ మహిళా క్రికెటర్లు ఆస్ట్రేలియా లాంటి దేశాలకు శరణార్థులుగా వెళ్లి క్రికెట్ ఆడుతున్నారు. ఇలాంటి వారితో పాటు క్రికెట్ను కెరీర్గా ఎంచుకోవాలనుకునే ఆఫ్ఘనిస్తాన్ యువతులకు మద్దతుగా ఐసీసీ ఈ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ప్రత్యేక టాస్క్ఫోర్స్తో పాటు ఆఫ్ఘన్ మహిళా క్రికెట్కు మద్దతు నిధిని ప్రారంభిస్తున్న విషయాన్ని ఐసీసీ అధ్యక్షుడు జై షా ఓ అధికారిక ప్రకటనలో తెలిపారు.