ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో ఇవాళ (ఏప్రిల్ 12) జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో గిల్ 4000 ఐపీఎల్ పరుగుల మైలురాయిని అధిగమించాడు. తద్వారా అత్యంత వేగంగా ఈ మైలురాయిని తాకిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు.
గిల్ ఈ మైలురాయిని 118వ ఇన్నింగ్స్లో చేరుకోగా.. రాహుల్ 105, క్రిస్ గేల్ 112, డేవిడ్ వార్నర్ 114, జోస్ట్ బట్లర్ 116 ఇన్నింగ్స్ల్లో ఈ ఘనత సాధించారు. ఈ జాబితా టాప్-5లో గిల్ రెండో భారత ప్లేయర్గా నిలిచాడు. దిగ్గజం విరాట్ కోహ్లికి ఈ మైలురాయిని తాకేందుకు 128 ఇన్నింగ్స్లు అవసరం కాగా.. గిల్ అతని కంటే వేగంగా ఈ ఘనత సాధించాడు.
బంతుల ప్రకారం చూస్తే.. అత్యంత వేగంగా 4000 ఐపీఎల్ పరుగులు పూర్తి చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో గిల్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో సూర్యకుమార్ యాదవ్ టాప్ ప్లేస్లో ఉండగా.. దిగ్గజం విరాట్ కోహ్లి టాప్-5లో కూడా లేడు.
అత్యంత వేగంగా (బంతులు) 4000 ఐపీఎల్ పరుగులు పూర్తి చేసిన టాప్-5 భారత ఆటగాళ్లు..
సూర్యకుమార్ యాదవ్- 2714
శుభ్మన్ గిల్- 2875
సురేష్ రైనా- 2886
ఎంఎస్ ధోని- 2887
సంజూ శాంసన్- 2915
మ్యాచ్ విషయానికొస్తే.. గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ప్రసిద్ద్ కృష్ణ (4-0-28-4), అశోక్ కుమార్ (4-0-32-2), సిరాజ్ (4-0-19-1) అద్భుతంగా బౌలింగ్ చేసి లక్నోను కట్టడి చేశారు. లక్నో ఇన్నింగ్స్లో 30 పరుగులు చేసిన మార్క్రమ్ టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం బరిలోకి దిగిన గుజరాత్ 16 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసి, లక్ష్యం దిశగా సాగుతోంది.


