పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఓ భారీ ఐపీఎల్ రికార్డును సొంతం చేసుకున్నాడు. లీగ్ చరిత్రలో హేమాహేమీలను కాదని అత్యధిక విజయాల శాతం (59.80) నమోదు చేసిన కెప్టెన్గా చరిత్ర సృష్టించాడు. 2026 ఎడిషన్లో భాగంగా నిన్న (ఏప్రిల్ 3) సీఎస్కేపై గెలుపుతో ఈ ఫీట్ను సాధించాడు.
ఈ గెలుపుతో శ్రేయస్ హార్దిక్ పాండ్యాను (59.01) అధిగమించి టాప్ ప్లేస్కు చేరాడు. ఈ విభాగంలో శ్రేయస్, హార్దిక్ తర్వాతి స్థానాల్లో సచిన్ టెండూల్కర్ (58.82), ఎంఎస్ ధోని (58.36), షేన్ వార్న్ (56.36), రోహిత్ శర్మ (56.32) ఉన్నారు.
ధోని, రోహిత్ కూడా సాధించలేని ఘనత
ఐపీఎల్ చరిత్ర అత్యంత విజయవంతమైన కెప్టెన్లు ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ కూడా సాధించిన లేని ఘనతను శ్రేయస్ అయ్యర్ సాధించాడు. ధోని, రోహిత్ తలో 5 ఐపీఎల్ ట్రోఫీలు సాధించినా నమోదు చేయలేని అత్యధిక విజయాల శాతాన్ని శ్రేయస్ కేవలం ఒకే ఒక ట్రోఫీ ద్వారానే సాధించాడు.
ఐపీఎల్ కెప్టెన్గా శ్రేయస్కు మరో ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది. మూడు వేర్వేరు ఫ్రాంచైజీలను ఫైనల్కు చేర్చిన ఏకైక కెప్టెన్ అతను మాత్రమే. 2024లో కేకేఆర్ను ఛాంపియన్గా నిలిపిన శ్రేయస్.. 2020లో ఢిల్లీని, 2025లో పంజాబ్ను రన్నరప్గా నిలిపాడు.
శ్రేయస్ సారథ్యంలో పంజాబ్ ఈ సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతుంది. రన్నరప్ హోదాలో బరిలోకి దిగిన ఈ జట్టు వరుసగా రెండు మ్యాచ్ల్లో విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కూర్చుంది.
తొలి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై 3 వికెట్ల తేడాతో గెలుపొందిన పంజాబ్.. తాజాగా సీఎస్కేను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. సీఎస్కేపై గెలుపులో శ్రేయస్ వ్యక్తిగతంగానూ కీలకపాత్ర పోషించాడు. 210 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బాధ్యతాయుతమైన అర్ద సెంచరీ చేసి గెలుపుకు ప్రధాన కారకుడయ్యాడు.


