సెమీస్‌లో ఓడిన సాత్విక్‌–చిరాగ్‌ జోడీ | Satwik Chirag pair lost in the semis | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో ఓడిన సాత్విక్‌–చిరాగ్‌ జోడీ

Nov 24 2024 4:18 AM | Updated on Nov 24 2024 4:18 AM

Satwik Chirag pair lost in the semis

చైనా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ

షెన్‌జెన్‌ (చైనా): భారత అగ్రశ్రేణి డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టిలకు చైనా మాస్టర్స్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో సెమీఫైనల్లో చుక్కెదురైంది. పారిస్‌ ఒలింపిక్స్‌ తర్వాత బరిలోకి దిగిన ఈ టోర్నీలో నిలకడైన ఆటతీరు కనబరిచిన ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ భారత ద్వయానికి అనూహ్యంగా అన్‌సీడెడ్‌ కొరియన్‌ జంట చేతిలో ఓటమి ఎదురైంది. 

సాత్విక్‌–చిరాగ్‌ జోడీ 18–21, 21–14, 16–21తో జిన్‌ యంగ్‌–సియో సంగ్‌ జె (కొరియా) జంట చేతిలో పరాజయం చవిచూసింది. గంటా 14 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో భారత ద్వయం పైచేయి సాధించినా... కీలకదశలో వరుసగా పాయింట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. తొలి గేమ్‌లో 11–10తో, తర్వాత 15–12తో ఆధిక్యం కనబరిచిన సాతి్వక్‌–చిరాగ్‌లు తర్వాత వెనుకబడి గేమ్‌ను కోల్పోయారు. 

కానీ రెండో గేమ్‌లో అద్భుతంగా ఆడి ప్రత్యర్థుల్ని ఓడించినప్పటికీ నిర్ణాయక మూడో గేమ్‌లో కొరియన్‌ జోరు ముందు నిలువలేకపోయారు. గత సీజన్‌ చైనా మాస్టర్స్‌ టోర్నీలో ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ డబుల్స్‌ జోడీ ఫైనల్‌ చేరి రన్నరప్‌తో తృప్తి పడగా... ఈ సారి సెమీస్‌లోనే కంగుతింది. 

Advertisement
 
Advertisement
Advertisement