మూడు మ్యాచ్ల వన్డే, టీ20 సిరీస్ల కోసం బంగ్లాదేశ్లో పర్యటిస్తున్న శ్రీలంక మహిళల క్రికెట్ జట్టు, తొలుత వన్డే సిరీస్ను 2-1 తేడాతో.. తాజాగా టీ20 సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది.
సిల్హెట్ వేదికగా ఇవాళ (ఏప్రిల్ 30) జరిగిన రెండో టీ20లో శ్రీలంక 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. హర్షిత సమరవిక్రమ (49), కెప్టెన్ చమారీ ఆటపట్టు (42) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లలో ఇమేషా దులాని 27, నిలాక్షి డిసిల్వ 22 (నాటౌట్), హాసిని పెరీరా 9 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో ఫరిహా త్రిస్న, సుల్తానా ఖాతూన్, నహిద అక్తెర్, రితూ మోనీ తలో వికెట్ తీశారు.
అనంతరం లక్ష్య ఛేదనలో తడబడిన బంగ్లా బ్యాటర్లు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 133 పరుగులకే పరిమితమయ్యారు. షర్మిన్ అక్తెర్ (44 నాటౌట్) బంగ్లాను గెలిపించేందుకు విఫలయత్నం చేసింది. ఆమెకు మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. ఓపెనర్లు దిలారా అక్తెర్ 23, జుయారియా ఫిర్దోస్ 29 పరుగులు చేసినా, ఆతర్వాత వచ్చిన బ్యాటర్లు చేతులెత్తేశారు. కెప్టెన్ నిగార్ సల్తానా 7, షోర్నా అక్తెర్ 12, శోభన మోస్త్రి డకౌటయ్యారు. రితూ మోనీ 9 పరుగులతో అజేయంగా నిలిచింది.
లంక బౌలర్లలో కవిష దిల్హరి 2 వికెట్లు తీయగా.. మిథాలీ అయోధ్య మినహా మిగతా బౌలర్లంతా వికెట్లు తీయలేకపోయినా పొదుపుగా బౌలింగ్ చేశారు. ఈ సిరీస్లోని నామమాత్రపు మూడో టీ20 మే 2న ఇదే సిల్హెట్ వేదికగా జరుగనుంది.


