WI Vs IND: Rovman Powell Dedicates Series Win Against India To Caribbean People - Sakshi
Sakshi News home page

నాకు మాటలు కూడా రావడం లేదు.. క్రెడిట్‌ వాళ్లకే! అతడు హీరో: విండీస్‌ కెప్టెన్‌

Aug 14 2023 10:49 AM | Updated on Aug 14 2023 3:35 PM

 Rovman Powell dedicates series win against India to Caribbean people - Sakshi

స్వదేశంలో టీమిండియాతో టెస్టు, వన్డే సిరీస్‌లను కోల్పోయిన వెస్టిండీస్‌.. టీ20 సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. ఫ్లోరిడా వేదికగా టీమిండియాతో జరిగిన నిర్ణయాత్మక ఐదో టీ20లో 8 వికెట్ల తేడాతో విండీస్‌ ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-2 తేడాతో కరేబియన్‌ జట్టు సొంతం చేసుకుంది. 6 ఏళ్ల తర్వాత భారత్‌పై విండీస్‌కు ఇదే తొలి టీ20 సిరీస్‌ విజయం కావడం గమానార్హం.

విండీస్‌ చివరగా 2017లో టీమిండియాపై టీ20 సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇక చారిత్రత్మక సిరీస్‌ విజయంపై మ్యాచ్‌ అనంతరం వెస్టిండీస్‌ కెప్టెన్‌ రోవ్‌మన్‌ పావెల్‌ స్పందించాడు. "టీ20 సిరీస్‌ను సొంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సమయంలో ఏమి మాట్లాడాలో కూడా తెలియడం లేదు. ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధించడానికి చాలా కష్టపడ్డాం. మ్యాచ్‌కు ముందు రోజు సాయంత్రం మేము ఓ మీటింగ్‌ పెట్టుకున్నాం.

కరేబియన్‌ ప్రజలు మన నుంచి గెలుపు ఆశిస్తున్నారని మా బాయ్స్‌కు చెప్పా. మేము విజయం సాధించడంలో కోచింగ్‌ స్టాప్‌ది కీలక పాత్ర. మేము వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చెందడంతో కాస్త నిరాశ చెందాము. కానీ మా కోచింగ్‌ స్టాప్‌ మాత్రం మాకు మద్దతుగా నిలిచారు. ఈ సిరీస్‌లో మా జట్టు నుంచి చాలా మంది ఆటగాళ్లు వ్యక్తిగత ప్రదర్శనతో అకట్టుకున్నారు.

జట్టులో ఎవరో ఒకరు రాణించినా కొన్ని సందర్భాల్లో మేలు జరుగుతుంది. ముఖ్యంగా నికోలస్‌ పూరన్‌ ఈ సిరీస్‌లో మాకు కీలక విజయాలు అందించాడు. అతడు మా జట్టులో ముఖ్యమైన ఆటగాడు. పవర్‌ఫుల్‌ బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న మా బౌలర్లకు క్రెడిట్‌ ఇవ్వాలనకుంటున్నాను. అదే విధంగా మాకు సపోర్ట్‌గా నిలిచిన విండీస్‌ క్రికెట్‌కు, అభిమానులకు ధన్యవాదాలు" అంటూ పోస్ట్‌మ్యాచ్‌ ప్రేజేంటేషన్‌లో పావెల్‌ పేర్కొన్నాడు.
చదవండి#Hardik Pandya: ఇంత చెత్త కెప్టెన్‌ను ఇప్పటివరకు చూడలేదు.. ఇతడా టీమిండియా ఫ్యూచర్‌?

Advertisement
 
Advertisement
Advertisement