ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్ వరుసగా హ్యాట్రిక్ ఓటములను చవిచూసింది. ఆదివారం వాంఖడే స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో 18 పరుగుల తేడాతో ముంబై ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్లో స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ గాయపడడం ముంబై ఇండియన్స్ మేనెజ్మెంట్ను కలవరపెడుతోంది.
241 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి రోహిత్ శర్మ మంచి ఆరంభాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ ముంబై ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో రోహిత్ శర్మ తొడ కండరాలు పట్టేశాయి. వికెట్ల మధ్య పరిగెత్తేందుకు రోహిత్ ఇబ్బంది పడ్డాడు. వెంటనే ఫిజియో మైదానంలోకి వచ్చి రోహిత్ కుడి హ్యామ్స్ట్రింగ్కు బ్యాండేజ్ వేశాడు.
కానీ ఏ మాత్రం రోహిత్ నొప్పి లేదు. దీంతో అదే ఓవర్లో రోహిత్ రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. రిహిత్ ఇలా మధ్యలోనే వెళ్లిపోవడంతో వాంఖడే స్టేడియం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. తర్వాత మరి అతడు బ్యాటింగ్కు రాలేదు. రోహిత్ స్కాన్ రిపోర్ట్లు కోసం ముంబై మేనెజ్మెంట్ ఎదురుచూస్తోంది. అతడి గాయంపై మ్యాచ్ అనంతరం ముంబై స్టార్ షేర్ఫేన్ రూథర్ఫర్డ్ అప్డేట్ ఇచ్చాడు.
"రోహిత్ తొడ కండరాలు పట్టేసినట్లు అన్పిస్తోంది. కానీ అధికారికంగా ఏమీ ఖరారు కాలేదు. ప్రస్తుతం అతడు మా వైద్యబృందం పర్యవేక్షణలో ఉన్నాడు. స్కాన్ రిపోర్ట్ల కోసం వేచి చూస్తున్నాం. రోహిత్ ఫిట్నెస్ గురించి త్వరలోనే పూర్తి సమాచారం తెలుస్తుంది" రూథర్ఫర్డ్ పేర్కొన్నాడు.
ఒకవేళ రోహిత్ గాయం గ్రేడ్-1లో ఉన్నట్లయితే పూర్తిగా కోలుకోవడానికి సుమారు నాలుగు వారాల సమయం పట్టనుంది. అదే జరిగితే రోహిత్ ఐపీఎల్-2026 సీజన్ మధ్యలోనే వైదొలిగే అవకాశముంది. ఏదేమైనప్పటికి రోహిత్ త్వరగా కోలుకుని తిరిగి మైదానంలో అడుగుపెట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు.
చదవండి: BCCI: ఫోన్ చూసిన రోమీ, వైభవ్ సూర్యవంశీ.. బీసీసీఐ కఠిన చర్యలు!


