ODI WC: రోహిత్‌ శర్మ ఎందుకిలా చేస్తున్నాడు? | Is Rohit Sharma Distances Himself From India 2027 WC Plans | Sakshi
Sakshi News home page

ODI WC: రోహిత్‌ శర్మ ఎందుకిలా చేస్తున్నాడు?

Jun 2 2026 3:35 PM | Updated on Jun 2 2026 4:15 PM

Is Rohit Sharma Distances Himself From India 2027 WC Plans

దాదాపు రెండు నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉంది టీమిండియా. భారత జట్టులోని ప్రధాన ఆటగాళ్లంతా ఐపీఎల్‌-2026తో బిజీ బిజీగా గడిపారు. ఇక ఈ మెగా టోర్నీకి ఆదివారం నాటి ఫైనల్‌తో తెరపడింది.

ఈ నేపథ్యంలో జూన్‌ 6 నుంచే టీమిండియా రంగంలోకి దిగనుంది. స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో తొలుత ఓ టెస్టు మ్యాచ్‌ ఆడి.. ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్‌ ఆడేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. ఇక అఫ్గన్‌తో మ్యాచ్‌లకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే తమ జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఫిట్‌నెస్‌లోబడే...
శుబ్‌మన్‌ గిల్‌ సారథ్యంలో  అఫ్గన్‌తో ఆడే ఈ జట్లలో వన్డేలకు మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఎంపికయ్యారు. అయితే, వీరిద్దరు ఫిట్‌నెస్‌లోబడే ఆడతారని బీసీసీఐ స్పష్టం చేసింది. కాగా ఐపీఎల్‌-2026లో హార్దిక్‌ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్‌కు ఆడిన రోహిత్‌ శర్మ.. సీజన్‌ మధ్యలో గాయపడ్డాడు.

తొడ కండరాల గాయంతో ఐదు మ్యాచ్‌లకు రోహిత్‌ దూరమయ్యాడు. ఆ తర్వాత తిరిగి జట్టుతో చేరినా ఇంపాక్ట్‌ ప్లేయర్‌గానే బరిలోకి దిగాడు. మరోవైపు.. హార్దిక్‌ పాండ్యా సైతం వెన్నునొప్పితో నాలుగు మ్యాచ్‌లు ఆడలేకపోయాడు.

క్లియరెన్స్‌ వస్తేనే..
ఈ నేపథ్యంలో రోహిత్‌, హార్దిక్‌లను అఫ్గన్‌తో సిరీస్‌కు ఎంపిక చేసినప్పటికీ.. ఫిట్‌నెస్‌ ఆధారంగానే వారు ఆడతారో, లేదో తేలుతుందని బీసీసీఐ జట్టు ప్రకటన సమయంలో వెల్లడించింది. అదే విధంగా.. వీరిద్దరిని సిరీస్‌ ఆరంభానికి రెండు వారాల ముందే బెంగళూరులోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది.

ఇంత వరకు రిపోర్టు చేయని రోహిత్‌!
అక్కడి వైద్య బృందాన్ని సంప్రదించి.. వేగంగా కోలుకొనే అంశంపై దృష్టి పెట్టాలని.. వారి నుంచి ఫిట్‌నెస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాలని బోర్డు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హార్దిక్‌ పాండ్యా మంగళవారం (జూన్‌ 2)న బెంగళూరుకు పయనం కానుండగా.. రోహిత్‌ శర్మ మాత్రం ఇంత వరకు రిపోర్టు చేయలేదని ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ వెల్లడించింది.

కాగా వన్డే వరల్డ్‌కప్‌-2027 టోర్నీకి ముందు టీమిండియా కొద్ది వన్డేలు మాత్రమే ఆడనుంది. ఇలాంటి తరుణంలో రోహిత్‌ గాయపడటం.. బోర్డు ఆదేశాలు పాటించే అంశంలో స్పష్టత లేకపోవడం సందేహాలకు తావిస్తోంది.

రేసులోకి జైసూ!
ఇప్పటికే రోహిత్‌కు బదులు యశస్వి జైస్వాల్‌, ఇషాన్‌ కిషన్‌ పేర్లను శుబ్‌మన్‌ గిల్‌ ఓపెనింగ్‌ జోడీగా పరిగణించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ విషయంలో బోర్డు కూడా సానుకూలంగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో 39 ఏళ్ల రోహిత్‌ శర్మనే స్వయంగా తప్పుకోనున్నాడనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే..  ముల్లన్‌పూర్‌లో భారత్‌- అఫ్గన్‌ మధ్య ఏకైక టెస్టు జరుగనుండగా.. జూన్‌ 13, 17, 20 తేదీల్లో వన్డే సిరీస్‌ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది.

చదవండి: IPL 2026: అత్యుత్తమ జట్టు ఇదే!

Advertisement
 
Advertisement
Advertisement