ఐపీఎల్-2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 18 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్లో విజయం సాధించినప్పటికి.. ఆర్సీబీ శిబిరంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గాయంపై ఆందోళన నెలకొంది. బ్యాటింగ్లో హాఫ్ సెంచరీతో సత్తాచాటిన కోహ్లి, సెకెండ్ ఇన్నింగ్స్లో మాత్రం ఫీల్డింగ్ రాలేదు.
కోహ్లికి ఏమైంది?
అతడి స్ధానంలో ఇంగ్లండ్ యువ ఆటగాడు జాకబ్ బెతల్ సబ్స్ట్యూట్ ఫీల్డర్గా మైదానంలోకి వచ్చాడు. కోహ్లి చీలమండ గాయం కారణంగా ఫీల్డింగ్కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో మెడికల్ టీమ్ డ్రెస్సింగ్ రూమ్లోనే కోహ్లికి చికిత్స అందించింది. అయితే విరాట్ గాయంపై మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ అప్డేట్ ఇచ్చాడు.
"ప్రస్తుతానికి కచ్చితంగా విరాట్కు ఏమైందన్నది తెలియదు. కానీ అతడు ఇప్పుడు బాగానే ఉన్నాడు" అని పాటిదార్ పేర్కొన్నాడు. ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్లో ఏప్రిల్ 15న లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ నాటికి కోహ్లి కోలుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడిన విరాట్.. 179 పరుగులు చేశాడు.
చదవండి: IPL 2026: ఐపీఎల్ నుంచి రోహిత్ శర్మ అవుట్?


