పాక్ క్రికెట్‌లో సంక్షోభం; మ‌న‌స్తాపానికి గురై ప‌ద‌వికి రాజీనామా! | Pakistan Cricket-Crisis Selector-Misbah Resigns After 7-Players-Coach Sacked | Sakshi
Sakshi News home page

పాక్ క్రికెట్‌లో సంక్షోభం; మ‌న‌స్తాపానికి గురై ప‌ద‌వికి రాజీనామా!

Sep 1 2026 5:23 PM | Updated on Sep 1 2026 5:40 PM

Pakistan Cricket-Crisis Selector-Misbah Resigns After 7-Players-Coach Sacked

Photo Credit: Twitter

పాకిస్థాన్ క్రికెట్‌లో మ‌రోసారి సంక్షోభం నెల‌కొంది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో రెండు వ‌రుస ఓట‌ములు ఆ జ‌ట్టులో ముస‌లం పుట్టించింది. టెస్టు సిరీస్‌లో పాక్ వ‌రుస‌ ఓటముల కారణంగా పీసీబీ (PCB) జట్టులో భారీ మార్పులు చేసింది. అయితే సెలెక్టర్లతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే ప్లేయర్లను తొలగించడం, కోచింగ్ స్టాప్‌ను మార్చడం చేసింది. 

దీంతో మ‌న‌స్తాపానికి గురైన పాకిస్తాన్ జ‌ట్టు సెలెక్ష‌న్ క‌మిటీ స‌భ్యుడు, మాజీ కెప్టెన్ మిస్బా-ఉల్‌-హ‌క్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశాడు. అంతేకాదు లాహోర్‌లోని నేషనల్ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ కన్సల్టెంట్ పదవికి కూడా రాజీనామా చేస్తున్న‌ట్లు మిస్బా ప్ర‌క‌టించాడు. అయితే మిస్బా రాజీనామాను పీసీబీ ఇంకా ఆమోదించ‌లేదు.

అస‌లేం జ‌రిగింది?
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జ‌రిగిన రెండో టెస్టులో 194 పరుగుల తేడాతో ఓటమి పాలైన తర్వాత పాకిస్థాన్ జట్టులో పీసీబీ భారీ మార్పులు చేసింది. సెల‌క్ట‌ర్ల‌ను సంప్ర‌దించ‌కుండానే టెస్టు జ‌ట్టు నుంచి ఏడుగురు ఆట‌గాళ్ల‌ను విడుద‌ల చేసింది. టెస్టు కోచ్ స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్‌, బౌలింగ్ కోచ్ ఉమ‌ర్ గుల్‌ల‌ను కూడా వారి ప‌ద‌వుల నుంచి తొల‌గించిన‌ట్లు స‌మాచారం. మూడో టెస్టుకు ముందు వైట్-బాల్ హెడ్ కోచ్ మైక్ హసన్, బౌలింగ్ కోచ్ ఆష్లే నాఫ్కే టెస్టు కోచింగ్ సిబ్బందిలో చేరారు.

పాక్ జ‌ట్టు నుంచి విడుద‌లైన ఆట‌గాళ్ల‌లో మహమ్మద్ రిజ్వాన్, ఇమామ్-ఉల్-హక్, సల్మాన్ ఆఘా, అలీ ఉస్మాన్, ఆమిర్ జమాల్, అవైస్ జాఫర్, ఖుర్రం షాజాద్ ఉన్నారు. వీరి స్థానంలో స‌యీమ్ అయూబ్‌, అబ్దుల్లా ఫ‌జ‌ల్‌తో పాటు కేవ‌లం 10 మ్యాచ్‌ల ఉమ్మ‌డి అనుభ‌వం ఉన్న ఐదుగురు కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకువచ్చింది.

జ‌ట్టులోకి వ‌చ్చిన ఐదుగురు కొత్త ఆట‌గాళ్లు: అరాఫ‌త్‌ మిన్హాస్, మహమ్మద్ ఇమ్రాన్ జూనియర్, సాద్ బేగ్, మహమ్మద్ ఇమ్రాన్ రంధావా, రజావుల్లా.

2019లో పాకిస్తాన్ హెడ్‌కోచ్ ప‌ద‌వి
పాకిస్తాన్ అత్యంత విజ‌య‌వంత‌మైన టెస్టు కెప్టెన్‌గా పేరు పొందిన మిస్బా ఉల్ హ‌క్ వీడ్కోలు అనంత‌రం పీసీబీలో ప‌లు కీల‌క ప‌ద‌వులు నిర్వ‌హించాడు. 2019లో పాకిస్తాన్ హెడ్‌కోచ్ స‌హా చీఫ్ సెలెక్ట‌ర్ ప‌ద‌వికి ఎంపిక‌య్యాడు. అయితే కోచింగ్ బాధ్యతలపై దృష్టి పెట్టడానికి 2020 అక్టోబర్‌లో చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి వైదొలిగారు. ఆ తర్వాత 2021లో హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేశారు.

2023లో, మిస్బా అప్పటి తాత్కాలిక నిర్వహణ కమిటీ అధిపతి జకా అష్రఫ్ ఆధ్వర్యంలో సలహాదారుగా పీసీబీకి తిరిగొచ్చాడు. ఈ ఏడాది మార్చిలో ఆకిబ్ జావేద్, సర్ఫరాజ్ అహ్మద్, అసద్ షఫిక్‌లతో పాటు మిస్బా నలుగురు సభ్యుల జాతీయ ఎంపిక కమిటీలో చేరాడు. దీంతోపాటు సంవత్సరానికి 180 రోజులు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా పనిచేస్తాన‌ని పీసీబీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌ను 0-2తో కోల్పోయిన పాకిస్తాన్‌ తమ చివరి టెస్టును సెప్టెంబర్‌ 9 నుంచి ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఆడనుంది.

చదవండి: గెలిపించిన ష‌మీ, ఇషాన్ కిష‌న్‌.. ఫైనల్లో ఈస్ట్‌జోన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement