ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 11) రాత్రి జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై సీఎస్కే 23 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. సంజూ శాంసన్ (115 నాటౌట్) శతక్కొట్టుడుతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఆయుశ్ మాత్రే (59 రిటైర్డ్ ఔట్) అర్ద సెంచరీతో రాణించగా.. ఆఖర్లో శివమ్ దూబే (20 నాటౌట్) బ్యాట్ ఝులిపించాడు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ.. జేమీ ఓవర్టన్ (4-0-18-4), అన్షుల్ కంబోజ్ (4-0-35-3) ధాటికి 20 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌటైంది. ట్రిస్టన్ స్టబ్స్ (60) ఢిల్లీని గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. ఈ గెలుపు సీఎస్కేకు ఈ సీజన్లో మొదటిది కాగా.. ఢిల్లీ నాలుగు మ్యాచ్ల్లో రెండో పరాజయాన్ని ఎదుర్కొంది.
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్ అనంతరం బీసీసీఐ ఇద్దరు ఆటగాళ్లపై చర్యలు తీసుకుంది. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఢిల్లీ ఆటగాడు నితీశ్ రాణాకు జరిమానా విధించింది.
సీఎస్కే కెప్టెన్గా రుతురాజ్ స్లో ఓవర్రేట్ మెయిన్టైన్ చేసినందుకు గానూ మ్యాచ్ ఫీజ్లో రూ. 12 లక్షలు కోల్పోగా.. నితీశ్కు మ్యాచ్ ఫీజ్లో 25 శాతం కోత, అదనంగా ఓ డీమెరిట్ పాయింట్ శిక్షగా విధించబడింది. సీఎస్కేకు ఈ సీజన్లో ఇది మొదటి తప్పిదం కావడంతో జరిమానాతో సరిపెట్టారు.
నితీశ్ విషయానికొస్తే.. అంపైర్లతో వాగ్వాదానికి దిగినందుకు గానూ ఈ శిక్షను ఎదుర్కొన్నాడు. ఢిల్లీ లక్ష్యాన్ని ఛేదిస్తున్న సమయంలో (19వ ఓవర్లో) ట్రిస్టన్ స్టబ్స్ గ్లవ్స్ మార్చుకోవాలని అంపైర్లను కోరగా, వారు నిరాకరించారు.
దీంతో నితీశ్ మధ్యలో కల్పించుకొని స్టబ్స్కు వత్తాసుగా ఫోర్త్ అంపైర్తో వాగ్వాదానికి దిగాడు. అసభ్య పదజాలం కూడా వాడాడు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఆర్టికల్ 2.3 నిబంధన ప్రకారం ఇది లెవెల్ 1 నేరం కిందికి వస్తుంది. ఇందుకు మ్యాచ్ ఫీజ్లో 25 శాతం జరిమానాతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ కేటాయించారు.


