
PC: X
భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా మరోసారి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. భారత్లో తొలిసారి జరుగుతున్న అంతర్జాతీయ జావెలిన్ ఈవెంట్లో స్వర్ణ పతకంతో మెరిశాడు. బెంగళూరు వేదికగా తన పేరిట జరుగుతున్న ‘నీరజ్ చోప్రా క్లాసిక్’ టైటిల్ను ఈ గోల్డెన్ బాయ్ సొంతం చేసుకున్నాడు.
ఈ క్రమంలో తన పేరిట జరుగుతున్న అంతర్జాతీయ పోటీలో తానే పసిడి పతకం గెలిచిన తొలి అథ్లెట్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. అత్యుత్తమంగా ఈటెను 86.18 మీటర్ల దూరం విసిరి నీరజ్ గోల్డ్ మెడల్ గెలుచుకున్నాడు. బెంగళూరులోని శనివారం నాటి ఈవెంట్కు శ్రీ కంఠీవరవ స్టేడియం వేదికైంది.
ఇక కెన్యాకు చెందిన జూలియస్ యెగో 84.51 దూరం బల్లాన్ని విసిరి నీరజ్ తర్వాతి స్థానంలో నిలిచి రజత పతకం అందుకున్నాడు. శ్రీలంకకు చెందిన అండర్-16 మాజీ ఫాస్ట్ బౌలర్ రమేశ్ పతిరగె 84.34 మీటర్ల దూరం ఈటెను విసిరి కాంస్య పతకం గెలుచుకోగా.. భారత్కే చెందిన సచిన్ యాదవ్ తృటిలో కాంస్యాన్ని కోల్పోయాడు. అతడు అత్యుత్తమంగా బల్లాన్ని 82.33 మీటర్ల దూరం విసిరాడు.
హ్యాట్రిక్ కొట్టిన నీరజ్ చోప్రా
కాగా టోక్యో ఒలింపిక్స్-2020లో పసిడి పతకం గెలిచిన నీరజ్ చోప్రా.. 2024 పారిస్ ఒలింపిక్స్లో రజతం సొంతం చేసుకున్నాడు. అంతేకాదు..27 ఏళ్ల ఈ హర్యానా అథ్లెట్ ఖాతాలో ప్రపంచ చాంపియన్షిప్ స్వర్ణాలు, డైమండ్ లీగ్ టైటిల్స్.. అదే విధంగా ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో గెలిచిన పతకాలు ఉన్నాయి.
ఇక ఇటీవల పారిస్ డైమండ్ లీగ్, ఓస్ట్రావా గోల్డెన్ స్పైక్ టోర్నీల్లో టైటిల్స్ కైవసం చేసుకున్న నీరజ్ చోప్రా.. తాజాగా నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్ గెలిచి హ్యాట్రిక్ కొట్టాడు. ఈ ఈవెంట్లో నీరజ్ చోప్రా (భారత్)తో పాటు.. సిప్రియన్ మిర్జిగ్లాడ్ (పోలాండ్), లూయిజ్ మౌరిసియో డా సిల్వా (బ్రెజిల్), థామస్ రోలెర్ (జర్మనీ), కర్టిన్స్ థామ్సన్ (అమెరికా), మార్టిన్న్ కొనెస్నీ (చెక్ రిపబ్లిక్), జూలియస్ యెగో (కెన్యా), రమేశ్ పతిరగే (శ్రీలంక), సచిన్ యాదవ్ (భారత్), రోహిత్ యాదవ్ (భారత్), సాహిల్ సిల్వాల్ (భారత్), యశ్ వీర్ సింగ్ (భారత్) బరిలో దిగారు.
NEERAJ CHOPRA WINS NC CLASSIC 2025! 🏆
- The Winning Throw of 86.18m for G.O.A.T 🐐
pic.twitter.com/nPaJhHuJmk— The Khel India (@TheKhelIndia) July 5, 2025