పాకిస్తాన్ సూపర్ లీగ్లో కొత్తగా చేరిన హైదరాబాద్ కింగ్స్మెన్ ఫ్రాంచైజీ తమ విదేశీ ఆటగాళ్ల చేతికి తుపాకులను ఇచ్చింది. పాక్ ఆర్మీతో ఇంటరాక్షన్లో భాగంగా ఇది జరిగింది. సింధ్ పోలీస్ అకాడమీలో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో కింగ్స్మెన్ కెప్టెన్ మార్నస్ లబూషేన్, రిలే మెరిడిత్ (ఆస్ట్రేలియా), స్థానిక ఆటగాళ్లు ఫఖర్ జమాన్, నసీమ్ షా, మహ్మద్ రిజ్వాన్ తుపాకులతో ఫైరింగ్ చేస్తూ కనిపించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
నిపుణుల పర్యవేక్షణలో లాబుషేన్ మెషీన్ గన్తో, మెరిడిత్ పిస్టల్తో రేంజ్ షూటింగ్ చేశారు. ఈ సందర్భంగా లాబుషేన్ హైదరాబాద్ ఆటగాళ్ల సంతకాలతో ఉన్న ప్రత్యేక బ్యాట్ను సింధ్ డీఐజీ డాక్టర్ మక్సూద్ అహ్మద్కు అందజేశారు. పాకిస్తాన్లో క్రికెటర్లకు గతంలో కూడా ఆర్మీతో ఫిజికల్, మెంటల్ ట్రైనింగ్ ఇప్పించారు.
ఇదిలా ఉంటే, ఈ సీజన్తోనే పీఎస్ఎల్ అరంగేట్రం చేసిన హైదరాబాద్ కింగ్స్మెన్ ఫ్రాంచైజీ అంచనాలకు తగ్గట్టుగా రాణించడం లేదు. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో కేవలం రెండే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతుంది. ఇన్ని పరాజయాలు ఎదురైనా కింగ్స్మెన్కు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఇంకా ఈ జట్టు నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. వీటిలో భారీ విజయాలు సాధిస్తే, ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఈ జట్టులో లబూషేన్, కుసాల్ పెరీరా, మెరిడిత్, తీక్షణ లాంటి విదేశీ ఆటగాళ్లు ఉండగా.. సైమ్ అయూబ్, ఉస్మాన్ ఖాన్ లాంటి స్థానిక స్టార్లు ఉన్నారు. కింగ్స్మెన్ ఏప్రిల్ 16న జరిగే తమ తదుపరి మ్యాచ్లో రావల్పిండ్జ్తో తలపడనుంది.


