ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 3) జరిగిన మ్యాచ్లో సీఎస్కేపై పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా ప్రస్తుత ఎడిషన్లో వరుసగా రెండు మ్యాచ్ల్లో విజయాలు నమోదు చేసింది. సీఎస్కే విషయానికొస్తే.. ఈ జట్టుకు ఇది వరుసగా రెండో ఓటమి. తొలి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడి, తాజాగా పంజాబ్ చేతిలో పరాజయంపాలైంది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఆయుశ్ మాత్రే (73) అర్ద సెంచరీతో సత్తా చాటగా.. శివమ్ దూబే (45 నాటౌట్), సర్ఫరాజ్ ఖాన్ (32) రాణించారు. రుతురాజ్ గైక్వాడ్ (28) పర్వాలేదనిపించగా.. సంజూ శాంసన్ (7), కార్తీక్ శర్మ (1) నిరాశపరిచారు. పంజాబ్ బౌలర్లలో విజయ్ కుమార్ 2, చహల్, జన్సెన్, బార్ట్లెట్ తలో వికెట్ తీశారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనను ధాటిగా ప్రారంభించిన పంజాబ్ మరో 8 బంతులు మిగిలుండగానే (18.4 ఓవర్లు) 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆదిలో ప్రియాంశ్ ఆర్య (39) విధ్వంసం సృష్టించి ఔట్ కాగా.. ప్రభ్సిమ్రన్ (43), కూపర్ కన్నోల్లీ (36), శ్రేయస్ అయ్యర్ (50) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లు ఆడి గెలుపుకు పునాది వేశారు.
ఆఖర్లో శశాంక్ సింగ్ (14 నాటౌట్), స్టోయినిస్ (9 నాటౌట్) ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా పంజాబ్ను గెలుపు తీరాలు దాటించారు. సీఎస్కే బౌలర్లలో మ్యాట్ హెన్రీ, అన్షుల్ కంబోజ్ తలో 2 వికెట్లు తీశారు. సీఎస్కే సొంతగడ్డపై భారీ స్కోర్ చేసినా, దాన్ని కాపాడుకోలేకపోయింది.


