ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 30) జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఆర్సీబీకి షాకిచ్చింది (4 వికెట్ల తేడాతో గెలుపు). అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన గుజరాత్ ఆర్సీబీని 19.2 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ మ్యాచ్లో గుజరాత్ బౌలర్లతో పాటు ఫీల్డర్లు కూడా చెలరేగిపోయారు.
హోల్డర్ 3, సాయి సుదర్శన్, రషీద్ ఖాన్ తలో 2 క్యాచ్లతో ఆర్సీబీని దారుణంగా దెబ్బకొట్టారు. బౌలింగ్లో అర్షద్ ఖాన్ 3, హోల్డర్, రషీద్ ఖాన్ తలో 2, సిరాజ్, రబాడ చెరో వికెట్ పడగొట్టి ఆర్సీబీని కుప్పకూల్చారు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో పడిక్కల్ (40) టాప్ స్కోరర్ కాగా.. విరాట్ 28, బేతెల్ 5, పాటిదార్ 19, జితేశ్ శర్మ 1, టిమ్ డేవిడ్ 9, కృనాల్ 4, షెపర్డ్ 17, వెంకటేశ్ అయ్యర్ 12, భువనేశ్వర్ కుమార్ 15 (నాటౌట్), హాజిల్వుడ్ డకౌటయ్యారు.
అనంతరం 156 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ తడబడుతూనే బ్యాటింగ్ చేసినప్పటికీ.. 15.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. భువనేశ్వర్ కుమార్ (4-0-28-3), రొమారియో షెపర్డ్ (4-0-30-2) ఇబ్బంది పెట్టినా.. శుభ్మన్ గిల్ (43), జోస్ బట్లర్ (39), రాహుల్ తెవాతియా (27 నాటౌట్) ఓ మోస్తరు ఇన్నింగ్స్లు ఆడి గుజరాత్ను విజయతీరాలకు చేర్చారు.
మిగతా బ్యాటర్లలో సాయి సుదర్శన్ 6, వాషింగ్టన్ సుందర్ 12, షారుక్ ఖాన్ 8, జేసన్ హోల్డర్ 12, రషీద్ ఖాన్ 7 (నాటౌట్) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో భువీ, షెపర్డ్తో పాటు సుయాశ్ శర్మ (3.5-0-44-1) వికెట్ తీశాడు. గత మ్యాచ్లో చెలరేగి బౌలింగ్ చేసిన హాజిల్వుడ్ (4-0-56-0) ఈ మ్యాచ్లో వికెట్ తీయలేకపోగా.. ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు.


