
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 12) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై లక్నో సూపర్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. గిల్ (38 బంతుల్లో 60; 6 ఫోర్లు, సిక్స్), సాయి సుదర్శన్ (37 బంతుల్లో 56; 7 ఫోర్లు, సిక్స్) రాణించారు.
వాస్తవానికి ఈ మ్యాచ్లో గుజరాత్ భారీ స్కోర్ సాధించాల్సి ఉండింది. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ క్రీజ్లో ఉండగా గుజరాత్ స్కోర్ 12 ఓవర్లలో 120గా ఉండింది. అయితే వీరిద్దరు రెండు పరుగుల వ్యవధిలో ఔట్ కావడంతో గుజరాత్ స్కోర్ ఒక్కసారిగా నెమ్మదించింది.
తొలుత భారీగా పరుగులు సమర్పించుకున్న లక్నో బౌలర్లు అద్భుతంగా పుంజుకుని గుజరాత్ను ఓ మోస్తరు స్కోర్కే పరిమితం చేశారు. రూథర్ఫోర్డ్ 22 (19 బంతుల్లో 3 ఫోర్లు), బట్లర్ 16 (14 బంతుల్లో 2 ఫోర్లు), షారుక్ ఖాన్ 11 నాటౌట్ (6 బంతుల్లో సిక్సర్), సుందర్ 2 (3 బంతుల్లో), తెవాటియా డకౌటయ్యారు. లక్నో బౌలర్లలో బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్ తలో 2 వికెట్లు తీయగా.. దిగ్వేశ్ రాఠీ, ఆవేశ్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం ఛేదనకు దిగిన లక్నో..మార్క్రమ్ (31 బంతుల్లో 58; 9 ఫోర్లు, సిక్స్), పూరన్ (34 బంతుల్లో 61; ఫోర్, 7 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్లతో రెచ్చిపోవడంతో 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి సిక్సర్ల సునామీ సృష్టించాడు.
మిచెల్ మార్ష్ గైర్హాజరీలో (కూతురు అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్ ఆడలేదు) ఓపెనర్గా బరిలోకి దిగిన రిషబ్ పంత్ (18 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 21) ఓ మోస్తరుగా రాణించాడు. బదోని సిక్సర్తో మ్యాచ్ను ముగించాడు. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ 2, రషీద్ ఖాన్, వాషింగ్టన్ సందర్ తలో వికెట్ తీశారు.