
తొలి టెస్ట్ లో టీమిండియా విధించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఇంగ్లండ్ బరిలోకి దిగింది. సోమవారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించాలంటే ఆఖరిదైన ఐదవ రోజు బౌలింగ్ లో సత్తా చాటి 10 వికెట్లు తీయాల్సి ఉంది. మరోవైపు విజయానికి ఇంగ్లండ్ కు 350 పరుగులు అవసరం.
ఇంగ్లండ్ లక్ష్యం 371
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో టీమిండియా పట్టు బిగించింది. నాలుగో రోజు భారత్ సెకెండ్ ఇన్నింగ్స్లో భారీ స్కోర్ (364) చేసి ఆలౌటైంది. ఫలితంగా ఇంగ్లండ్ ముందు 371 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. కేఎల్ రాహుల్ (137), రిషబ్ పంత్ (118) సెంచరీలతో కదంతొక్కారు.
మిగతా భారత ఆటగాళ్లలో సాయి సుదర్శన్ 30, రవీంద్ర జడేజా 25 (నాటౌట్), యశస్వి జైస్వాల్ 4, శుభ్మన్ గిల్ 8, కరుణ్ నాయర్ 20, శార్దూల్ ఠాకూర్ 4, సిరాజ్ 0, బుమ్రా 0, ప్రసిద్ద్ కృష్ణ 0 పరుగులకు ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, జోష్ టంగ్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. బషీర్ 2, వోక్స్, స్టోక్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి జైస్వాల్ (101), శుభ్మన్ గిల్ (147), రిషబ్ పంత్ (134) సెంచరీలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ తలో నాలుగు వికెట్లు తీయగా.. షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ టీమిండియాకు ధీటుగా బదులిచ్చింది. ఓలీ పోప్ (106) సెంచరీతో కదంతొక్కగా.. హ్యారీ బ్రూక్ (99) పరుగు తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. మిగతా బ్యాటర్లలో బెన్ డకెట్ 62, జేమీ స్మిత్ 40, క్రిస్ వోక్స్ 38 రాణించడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 465 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ కృష్ణ మూడు, సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు.