
జాతీయ షూటింగ్ మాజీ కోచ్ సన్నీ థామస్ కన్నుమూత
కొచ్చి: జాతీయ షూటింగ్ మాజీ కోచ్ సన్నీ థామస్ కన్నుమూశారు. రెండు దశాబ్దాలకు పైగా భారత షూటర్ల విజయాల్లో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ థామస్ బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. కేరళలోని కొట్టాయాంకు చెందిన 84 ఏళ్ల సన్నీ థామస్కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. 1993 నుంచి 2012 వరకు భారత జాతీయ షూటింగ్ కోచ్గా వ్యవహరించిన థామస్... దేశానికి ఎన్నో మరపురాని విజయాలు అందించారు.
‘ద్రోణాచార్య’ అవార్డు
ఇక.. 2001లో ‘ద్రోణాచార్య’ అవార్డు అందుకున్న థామస్ శిక్షణలో రాటు దేలిన రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్... 2004 ఏథెన్స్ ఒలింపిక్స్ ‘డబుల్ ట్రాప్’లో రజత పతకం నెగ్గాడు.
ఒలింపిక్స్ షూటింగ్లో మన దేశానికి ఇదే తొలి పతకం కాగా... ఆ తర్వాత కూడా ఆయన శిష్యులు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో అభినవ్ బింద్రా దేశానికి తొలి వ్యక్తిగత స్వర్ణ పతకం అందించిన సమయంలోనూ థామస్ జాతీయ కోచ్గా ఉన్నారు.
‘ప్రొఫెసర్ థామస్ మరణం భారత షూటింగ్కు తీరని లోటు. భారత షూటింగ్కు ఆయన దిక్సూచి. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో మన షూటర్లు పతకాలు సాధిస్తున్నారంటే దీని వెనక ఆయన కృషి ఎంతో ఉంది’ అని జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ) అధ్యక్షుడు కాళికేశ్ నారాయణ్ సింగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
అభినవ్ బింద్రా భావోద్వేగం
మరోవైపు తన గురువు మృతిపై అభినవ్ బింద్రా తీవ్ర సంతాపం వ్యక్తం చేశాడు. ‘ఆయన కేవలం కోచ్ మాత్రమే కాదు. మెంటార్, గైడ్... అంతకన్నా ఎక్కువే. భారత షూటర్లకు ప్రొఫెసర్ థామస్ మార్గదర్శి. ఆయన అంకితభావం వల్లే దేశంలో షూటింగ్కు మంచి ఆదరణ లభిస్తోంది. నా కెరీర్లో ఆయన పాత్ర ఎంతో కీలకమైంది’ అని బింద్రా పేర్కొన్నాడు.
కాగా 2012 లండన్ ఒలింపిక్స్లో పతకం సాధించిన విజయ్ కుమార్ కూడా ఆయన శిష్యుడే. హైదరాబాదీ షూటర్ గగన్ నారంగ్, జస్పాల్ రాణా, సమరేశ్ జంగ్ వంటి ఎందరో అంతర్జాతీయ షూటర్లను దేశానికి అందించిన ప్రొఫెసర్ థామస్... తన కెరీర్లో జాతీయ చాంపియన్గానూ నిలిచారు.