ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ప్రారంభానికి ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో గురువారం ఐపీఎల్ 19వ సీజన్కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ కూడా విడుదలైంది. ఇక ఐపీఎల్లో ఐదుసార్లు చాంపియన్ చెన్నై సూపర్కింగ్స్ లెజెండరీ ఆటగాడు ఎంఎస్ ధోనికి ఇదే చివరి సీజన్ అనే ప్రచారం జోరుగా సాగుతుంది.
2025 సీజన్కు ముందు ఈ టీమిండియా మాజీ వికెట్ కీపర్ను చెన్నై ఫ్రాంచైజీ రూ. 4 కోట్లకు రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. గత రెండు మూడు సీజన్లుగా చూసుకుంటే లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు వస్తున్న ధోని కేవలం జట్టులో పెద్దన్న పాత్ర పోషిస్తూ జూనియర్లకు మార్గనిర్దేశనం చేస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో సీఎస్కే మాజీ ఆటగాడు సబ్రమణ్యం బద్రీనాథ్ ధోని వయసు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఒక యూట్యూట్ చానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన బద్రీనాథ్ మాట్లాడుతూ.. 'ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్ తరఫున 18వ ఓవర్ లేదా 19వ ఓవర్లో ఎంఎస్ ధోని బ్యాటింగ్కు వచ్చి సిక్సర్లు బాదడం చూడటానికి ఉత్సాహంగా ఉండవచ్చు. కానీ వయసును దృష్టిలో పెట్టుకుని చూస్తే మాత్రం ధోని అన్ని మ్యాచ్లు ఆడే సత్తా ఉండకపోవచ్చు. ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా జట్టులో కొనసాగే అవకాశముంది.
ఎందుకంటే ఇప్పటికీ సీఎస్కేలో బ్యాటర్లు, వికెట్ కీపర్లు చాలా మందే ఉన్నారు. ఫీల్డింగ్ సమయంలోనూ ధోని ఎక్కువగా మైదానంలో కనిపించకపోవచ్చు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కు ఒక అనుభవజ్ఞుడి స్థానంలో ధోని సలహాలు, సూచనలు ఇస్తాడా లేదా అన్నది చూడాలి. లేదంటే రుతురాజ్ స్వయంగా ధోనిని సూచనలు అడిగి వాటిని అమలు చేసే అవకాశం కూడా ఉంది.
వాస్తవానికి మైదానంలో ధోని చాలా తక్కువగా మాట్లాడుతాడు.అలాగే జట్టులోకి ట్రేడింగ్ రూపంలో వచ్చిన సంజూ శాంసన్ కూడా గతంలో రాజస్థాన్ రాయల్స్కు కెప్టెన్గా వ్యవహరించినవాడే. కాబట్టి అతడి సలహాలు కూడా రుతురాజ్ తీసుకునేందుకు చాన్స్ ఉంటుంది. గత సీజన్ను పరిగణలోకి తీసుకొని చూసుకున్న తర్వాత ధోని విలువ అలాగే ఉందా అన్నది చూడాలి. అయితే ఒకసారి బరిలోకి దిగుతున్నా అని ధోని చెప్పాడంటే సీజన్ ఆఖరి వరకు మైదానంలో ఉంటాడని భావిస్తున్నా'అని చెప్పుకొచ్చాడు.
ఇక ధోని 2026 సీజన్కు తన ప్రాక్టీస్ను ఎప్పుడో ఆరంభించాడు. గత సీజన్లో ఎక్కువగా 7, 8 స్థానాల్లో బ్యాటింగ్కు వచ్చిన ధోని 14 మ్యాచ్ల్లో 196 పరుగులు చేశాడు. ఈ సీజన్లో చెన్నై సూపర్కింగ్స్ తన తొలి మ్యాచ్ను మార్చి 30న రాజస్థాన్ రాయల్స్తో ఆడనుంది.


