కరేబియన్ గడ్డపై ఆస్ట్రేలియా మహిళల జట్టు జోరును కొనసాగుతోంది. ఇప్పటికే టీ20 సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన ఆస్ట్రేలియా మహిళల జట్టు.. ఇప్పుడు వన్డే సిరీస్ను కూడా ఖాతాలో వేసుకుంది. సోమవారం సెయింట్ కిట్స్ వేదికగా జరిగిన రెండో వన్డేలో 90 పరుగుల తేడాతో వెస్టిండీస్ను ఆసీస్ చిత్తు చేసింది.
దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే మూడు వన్డేల సిరీస్ను 2-0 తేడాతో కంగారులు కైవసం చేసుకున్నారు. ఈ మ్యాచ్లో టాస్ మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. గాయం నుంచి కోలుకుని తిరిగొచ్చిన బెత్ మూనీ (65) టాప్ స్కోరర్గా నిలిచింది. ఆమెతో పాటు జార్జియా వేర్హమ్ (39), లిచ్ఫీల్డ్(46), నికోలా కేరీ (30*), అలానా కింగ్ (26*) కీలక ఇన్నింగ్స్లు ఆడారు.
కుప్పకూలిన విండీస్
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఓపెనర్లు క్వీనా జోసెఫ్ (29), హేలీ మాథ్యూస్ (45) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అయితే ఆ తర్వాత మిడిలార్డర్ బ్యాటర్లు విఫలం కావడంతో విండీస్.. 46 ఓవర్లలో కేవలం 179 పరుగులకే కుప్పకూలింది. గత మ్యాచ్లో సెంచరీతో సత్తాచాటిన సీనియర్ బ్యాటర్ టేలర్ సైతం రెండో వన్డేలో రాణించలేకపోయింది.
ఆస్ట్రేలియా స్పిన్నర్లు జార్జియా వేర్హమ్, యాష్ గార్డనర్ తలా మూడు వికెట్లు పడగొట్టి విండీస్ పతనాన్ని శాసించారు. వీరిద్దరితో పాటు స్టాండ్ ఇన్ కెప్టెన్ మెక్గ్రాత్ రెండు వికెట్లు సాధించింది. మూడు వికెట్లతో సత్తాచాటిన జార్జియాకు ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు దక్కింది.
చదవండి: IPL 2026: సూర్యను ఎందుకు పక్కన పెట్టారు..?


