
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో తొలి సూపర్ ఓవర్ మ్యాచ్ అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మజా అందించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్తాన్ రాయల్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ టై అయింది. దీంతో మ్యాచ్ ఫలితాన్ని సూపర్ ఓవర్ ద్వారా నిర్ణయించారు.
సూపర్ ఓవర్లో రాజస్తాన్పై ఢిల్లీ థ్రిల్లింగ్ విజయం సాధించింది. ఇక సూపర్ ఓవర్ లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ స్టార్క్ దెబ్బకి 11 పరుగులు మాత్రమే చేసింది. ఇక ఢిల్లీ ఈ లక్ష్యాన్ని 4 బంతుల్లోనే ఛేదించి విజయ భేరి మ్రోగించింది. 189 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది.
రాజస్తాన్ బ్యాటర్లలో నితీష్ రాణా (51), యశస్వి జైస్వాల్ (51) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ సైతం 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 188 పరుగులే చేసింది. కాగా ఢిల్లీ చేతిలో రాజస్తాన్ రాయల్స్ ఓటమికి ఆ జట్టు స్టార్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ కారణమంటూ ఫ్యాన్స్ ఫైరవవుతున్నారు. అతడి "స్వార్థపూరిత నిర్ణయం వల్లే రాజస్తాన్ ఓడిపోయిందని మండిపడుతున్నారు.
అసలేమి జరిగిందంటే?
రాజస్తాన్ విజయానికి ఆఖరి ఓవర్లో 9 పరుగులు అవసరమ్యాయి. చివరి ఓవర్ వేసే బాధ్యతను మిచెల్ స్టార్క్కు కెప్టెన్ అక్షర్ పటేల్ అప్పగించాడు. తొలి బంతికి హెట్మైర్ సింగిల్ తీసి జురెల్కు స్ట్రైక్ ఇచ్చాడు. జురెల్ కూడా రెండో బంతికి సింగిల్ తీయగా.. మూడో బంతికి హెట్మైర్ డబుల్ తీశాడు.
నాలుగో బంతికి కూడా హెట్మైర్ డబుల్ సాధించాడు. దీంతో ఆఖరి రెండు బంతుల్లో రాజస్తాన్ విజయానికి కేవలం మూడు పరుగులు మాత్రమే అవరసమయ్యాయి. ఐదో బంతిని హెట్మైర్ హాఫ్ సైడ్ ఆడాడు. తొలి పరుగు పూర్తి చేసుకుని రెండో రన్ కోసం షిమ్రాన్ ముందుకు రాగా జురెల్ మాత్రం అందు తిరష్కరించాడు. జురెల్ పరిగెత్తుంటే ఈజీగా రెండో పరుగు వచ్చి ఉండేది.
కానీ జురెల్ మాత్రం ఆఖరి బంతికి స్ట్రైక్ తన వద్దే అంటి పెట్టుకోవాలని భావించాడు. ఆఖరి బంతికి సింగిల్ మాత్రమే తీసి మ్యాచ్ను ధ్రువ్ జురెల్ ఫినిష్ చేయలేకపోయాడు. ఆ బంతికి రెండో పరుగు తీసింటే రాజస్తాన్ విజయం సాధించి ఉండేది అని అభిమానులు పోస్ట్లు పెడుతున్నారు.