
PC: BCCI
ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ కరుణ్ నాయర్ ఆట తీరును భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా విమర్శించాడు. ఐపీఎల్-2025 (IPL 2025) రూపంలో తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో కరుణ్ విఫలమవుతున్నాడని పేర్కొన్నాడు. ఇలాగే కొనసాగితే వచ్చే సీజన్లో ఆడటం కష్టమేనని అభిప్రాయపడ్డాడు.
కాగా 2013 నుంచి ఐపీఎల్లో ఆడుతున్న కరుణ్ నాయర్ (Karun Nair).. ఇటీవలి కాలంలో దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపాడు. విదర్భ తరఫున రంజీల్లో, వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో వరుస శతకాలతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో కరుణ్కు మళ్లీ జాతీయ జట్టులో చోటు ఇవ్వాలనే డిమాండ్లు పెరిగాయి.
రూ. 30 లక్షల కనీస ధరతో
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లోనూ ఆడించాలని హర్భజన్ సింగ్ వంటి మాజీ క్రికెటర్లు కరుణ్కు మద్దతు పలికారు. కానీ సెలక్టర్లు మాత్రం అతడిని పట్టించుకోలేదు. ఇదిలా ఉంటే.. రూ. 30 లక్షల కనీస ధరతో కరుణ్ నాయర్ ఐపీఎల్-2025 మెగా వేలంలో తన పేరును రిజిస్టర్ చేసుకున్నాడు.
ఈ క్రమంలో రూ. 50 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని కొనుగోలు చేసింది. అయితే, ఇప్పటి వరకు ఈ సీజన్లో ఆడిన ఆరు మ్యాచ్లలో కలిపి కరుణ్ నాయర్ కేవలం 154 పరుగులే చేశాడు. అత్యధిక స్కోరు 87. ఇక తాజాగా మంగళవారం నాటి మ్యాచ్లోనూ కరుణ్ విఫలమయ్యాడు.
వన్డౌన్లో
అరుణ్ జైట్లీ స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో.. లక్ష్య ఛేదనలో భాగంగా కరుణ్ వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చాడు. మొత్తంగా పదమూడు బంతులు ఎదుర్కొని 15 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. వైభవ్ అరోరా బౌలింగ్లో లెగ్ బిఫోర్ వికెట్ (LBW)గా వెనుదిరిగాడు.
ఇక ఈ మ్యాచ్లో కేకేఆర్ విధించిన 205 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక ఢిల్లీ ఓటమిపాలైంది. ఆఖరి వరకు పోరాడినా పద్నాలుగు పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో కేకేఆర్ చేతిలో ఢిల్లీ ఓటమి అనంతరం కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కరుణ్ నాయర్ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
క్రికెట్ నీకు రెండో అవకాశం ఇచ్చింది.. కానీ
‘‘క్రికెట్ నీకు రెండో అవకాశం ఇచ్చింది. కానీ దానిని నువ్వు సద్వినియోగం చేసుకోవడం లేదు. ఇప్పటి వరకు కేవలం ఒక్కే మంచి ఇన్నింగ్స్ ఆడావు. రెండు, మూడు రనౌట్లలో భాగమయ్యావు.
కానీ నీ స్థాయికి తగ్గట్లుగా ఆడలేకపోతున్నావు. నీ నుంచి భారీ ఇన్నింగ్స్ రావడం లేదు. ముఖ్యంగా టాపార్డర్లో అదీ వన్డౌన్లో ఆడుతున్నా బ్యాట్ ఝులిపించలేకపోతున్నావు. ఇలా అయితే కష్టమే’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.
కాగా కరుణ్ నాయర్ ఐపీఎల్లో ఇప్పటి వరకు మొత్తంగా 82 మ్యాచ్లు ఆడి 1650 పరుగులు చేశాడు. ఇందులో 11 అర్ధ శతకాలు ఉన్నాయి. గతంలో అతడు పంజాబ్ కింగ్స్ (రూ. 5.6 కోట్లు), రాజస్తాన్ రాయల్స్, కోల్కతా, లక్నో సూపర్ జెయింట్స్ తదితర ఫ్రాంఛైజీలకు ఆడాడు.
ఐపీఎల్-2025: ఢిల్లీ వర్సెస్ కోల్కతా
👉టాస్: ఢిల్లీ.. తొలుత బౌలింగ్
👉కోల్కతా స్కోరు: 204/9 (20)
👉ఢిల్లీ స్కోరు: 190/9 (20)
👉ఫలితం: పద్నాలుగు పరుగుల తేడాతో ఢిల్లీపై కోల్కతా విజయం
👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సునిల్ నరైన్ (3/29).
చదవండి: అతడు వచ్చే ఏడాది ఆడకూడదు.. ఇప్పటికైనా చెన్నైని వదిలేయాలి: గిల్క్రిస్ట్