భారత సీనియర్ పురుషుల క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్ 2026 తర్వాత జరుగబోయే ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లండ్ సిరీస్లకు ఇద్దరు యువ పేసర్లు దూరమయ్యారు. ఆ ఇద్దరి పేర్లు హర్షిత్ రాణా, ఆకాశ్దీప్. వీరిద్దరు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. ఈ విషయాన్ని ఓ ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది.
హర్షిత్ మోకాలి గాయంతో ఇటీవల శస్త్రచికిత్స చేయించుకోగా.. ఆకాశ్దీప్ వెన్ను గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఇద్దరి రిహాబిలిటేషన్ సక్రమంగా సాగుతున్నప్పటికీ, పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు చాలా సమయం అవసరమని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. గాయాల కారణంగా హర్షిత్, ఆకాశ్దీప్ ఐపీఎల్కు కూడా దూరమయ్యారు.
కాగా, ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత జట్టు స్వదేశంలోనే ఆఫ్ఘనిస్తాన్తో ఏకైక టెస్ట్ మ్యాచ్, మూడు వన్డేలు ఆడనుంది. అనంతరం ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు వెళ్లనుంది. ఈ కీలక పర్యటనల్లో ఇద్దరు ప్రధాన పేసర్లు అందుబాటులో లేకపోవడం జట్టుకు పెద్ద లోటే.


