టీ20 వరల్డ్కప్-2026 విజేత భారత జట్టుకు బీసీసీఐ భారీ నగదు బహుమతిని ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియాకు రూ.131 కోట్ల రివార్డును అందజేయనున్నట్లు బోర్డు ఎక్స్ వేదికగా వెల్లడించింది. "టీ20 ప్రపంచకప్ చరిత్రలో టైటిల్ను రిటైన్ చేసుకున్న తొలి జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది.
టీ20 ప్రపంచకప్ ట్రోఫీని మూడుసార్లు గెలిచిన ఏకైక జట్టుగా నిలిచిన టీమిండియాకు రూ. 131 కోట్ల రూపాయల క్యాష్ రివార్డు ఇవ్వాలని నిర్ణయించాము. ఈ అద్భుత విజయానికి కారకులైన ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్, సెలెక్టర్లకు అభినందనలు" అని బీసీసీఐ ఓ ప్రకటలో పేర్కొంది.
కాగా గతంలో టీ20 ప్రపంచకప్-2024ను రోహిత్ శర్మ నేతృత్వంలో భారత్ గెలిచినప్పుడు బీసీసీఐ రూ. 125 కోట్లు ప్రకటించింది. ఇప్పుడు వరుసగా రెండోసారి ఛాంపియన్లుగా నిలిచినందుకు ఆ మొత్తాన్ని పెంచి రూ. 131 కోట్లు ఇవ్వనున్నారు. కాగా ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నుంచి కూడా భారత జట్టుకు భారీ మొత్తం అందింది.
ఛాంపియన్గా నిలిచినందుకు భారత్కు సుమారు రూ. 27.48 కోట్ల ప్రైజ్మనీనీ ఐసీసీ అందజేసింది. అంతేకాకుండా గ్రూపు స్టేజి, సూపర్-8 దశల్లో గెలిచి ప్రతీ మ్యాచ్కు అదనంగా సుమారు రూ. 28.6 లక్షల చొప్పున భారత్కు బోనస్ లభించనుంది.
అహ్మదాబాద్లో అదుర్స్
ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ పోరులో 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను భారత్ చిత్తు చేసింది. దీంతో ముచ్చటగా మూడో పొట్టి ప్రపంచకప్ టైటిల్ను భారత్ తమ ఖాతాలో వేసుకుంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో మూడుసార్లు టైటిల్ గెలుచుకున్న ఏకైక జట్టుగా భారత్ అవతరించింది.
ఈ తుది పోరులో మెన్ ఇన్ బ్లూ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్ల నష్టానికి ఏకంగా 255 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనలో కివీస్ 159 పరుగులకే కుప్పకూలింది.
చదవండి: పాక్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. 24 ఏళ్లకే రిటైర్మెంట్


