
లండన్: వింబుల్డన్ గ్రాండ్స్లామ్ ఈవెంట్ మరో రెండేళ్లలో150వ వార్షికోత్సవం జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో బ్రిటన్ మేటి టెన్నిస్ ఆటగాడు ఆండీ ముర్రే విగ్రహాన్ని ఆవిష్కరించాలని ఆల్ ఇంగ్లండ్ క్లబ్ భావించింది. దీని కోసం ముర్రే సంబంధిత కళాకారులతో కలిసి పనిచేయనున్నట్లు తెలిసింది. ముర్రే చుట్టుకొలతలు, ఒద్దిక, పొడవుల్ని వారితో పంచుకోనున్నాడు.
నిజానికి ‘బిగ్–త్రీ’ ఫెడరర్–నాదల్–జొకోవిచ్లతో ముర్రే సమకాలికుడైనప్పటికీ ఆ ముగ్గురితో పోల్చదగిన దిగ్గజమైతే కాదు. అయితే ముర్రే 2013లో వింబుల్డన్ టైటిల్తో 77 ఏళ్ల బ్రిటన్ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించడం ద్వారా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 1936లో ఫ్రెడ్ పెర్రీ గెలిచిన తర్వాత మరే బ్రిటన్ ప్లేయర్ వింబుల్డన్లో గెలుపొందలేకపోయాడు.
ఏడున్నర దశాబ్దాల తర్వాత ఎట్టకేలకు ముర్రే వింబుల్డన్ టైటిల్తో బ్రిటన్ ముచ్చట తీర్చాడు. 2027లో జరిగే 150 ఏళ్ల వింబుల్డన్ పండగలో ముర్రేతో పాటు పెర్రీ విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తారు. ముర్రే తన కెరీర్లో మూడు గ్రాండ్స్లామ్ టైటిళ్లను గెలిచాడు. 2012లో యూఎస్ ఓపెన్ గెలిచిన అతను 2013, 2016లలో వింబుల్డన్ విజేతగా నిలిచాడు. ఇక ఈ సీజన్ వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీ ఈ నెల 30 నుంచి జరుగుతుంది.
ఇదీ చదవండి: క్వార్టర్స్లో యూకీ జోడీ
మలోర్కా (స్పెయిన్): వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీకి సన్నాహాల్లో భాగంగా మలోర్కా ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో బరిలోకి దిగిన భారత స్టార్ యూకీ బాంబ్రీ శుభారంభం చేశాడు. రాబర్ట్ గాలోవే (అమెరికా)తో జత కలిసి ఈ టోర్నీలో పోటీపడుతున్న యూకీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.
పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో యూకీ–గాలోవే ద్వయం 6–3, 6–3తో గ్రెగోరి జాక్–అలెగ్జాండర్ ముల్లర్ (ఫ్రాన్స్) జోడీపై విజయం సాధించింది. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో యూకీ–గాలోవే ఆరు ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేశారు. తమ సర్వీస్ను ఒక్కసారి కూడా చేజార్చుకోని యూకీ–గాలోవే ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేశారు.