బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పర ప్రసాద్
ప్రశాంత్నగర్(సిద్దిపేట): ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆశీర్వాద దీపం వెలిగించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పర ప్రసాద్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమం ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారకంగా నిర్వహిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని గెజిట్ విడుదల చేసిన నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ పార్టీలు నిర్వహించకపోవడం శోచనీయమన్నారు. ఎంఐఎం పార్టీకి తొత్తులుగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. గురువారం హైదరాబాద్లోని పరేడ్గ్రౌండ్లో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా విమోచన దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. మోదీ ప్రపంచస్థాయి నాయకుడన్నారు. బ్రిక్స్ నిర్వహణను ప్రపంచదేశాలు అభినందించాయన్నారు. జిల్లాలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మోదీ అభిమానులు, కేంద్ర పథక లబ్ధిదారులు, గురువారం సాయంత్రం ఇంటింటా ఆశీర్వాద దీపం వెలిగించాలన్నారు. గురువారం నుంచి అక్టోబర్ 17 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గురువారం ఒక్కరోజే తెలంగాణ విమోచనదినోత్సవం, విశ్వకర్మ జయంతి, మోదీ జన్మదినం కావడం విశేషమన్నారు.


