బొడ్రాయి వద్ద రోడ్డు వెడల్పునకు అన్ని సంఘాలు ఏకగ్రీవ తీర్మానం
దుబ్బాక: పట్టణంలో ఇటీవల ప్రతిష్ఠించిన బొడ్రాయి వద్ద వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా రోడ్డు వెడల్పు చేయాలని రాజకీయాలకతీతంగా అన్ని కుల సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. పట్టణంలోని బొడ్రాయి వద్ద హిందు,ముస్లిం కులపెద్దలు, పట్టణంలోని అన్ని కుల సంఘాల బాధ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు, అన్ని రాజకీయపార్టీల నాయకులు బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బొడ్రాయి నడిరోడ్డుపై ఉండటంతో అక్కడ రోడ్డు వెడల్పు తక్కువగా ఉండటంతో పెద్ద వాహనాలు వెళ్లడం ఇబ్బందిగా తయారైంది. ఈ బొడ్రాయి నుంచే వినాయక విగ్రహాలు నిమజ్జనంకు తీసుకెళ్తారు. దీంతో వినాయక విగ్రహాలు వెళ్లేందుకు రోడ్డు ఇరుకుగా తయారైంది. ఇదే విషయమై సమావేశమైన అన్ని కుల మత సంఘాల బాధ్యులు ఇక్కడ రోడ్డును వెడల్పు చేయాలని తీర్మానించుకున్నారు. పట్టణాభివృద్ధికి రాజకీయాలకు, కుల మతాలకతీతంగా అందరూ ఏకతాటిపై నిలవడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


