చేర్యాల(సిద్దిపేట): ఈడీ, ఐటీ సోదాల పేరుతో సీపీఎంపై కేంద్రం చేపడుతున్న కక్ష సాధింపు చర్యలు వెంటనే మానుకోవాలని ఆ పార్టీనాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద నాయకులు నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కేరళం మాజీ సీఎం పినరయి విజయన్ నివాసంపై ఈడీ జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది ఒక ప్రతిపక్ష నాయకుడిపై కేంద్ర ప్రభుత్వం జరిపిన కక్షపూరితమైన దాడి అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ సవాళ్లు ఎదుర్కోలేకే ఇలాంటి కుయుక్తులు పన్నుతోందన్నారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రతిపక్షాలపై కేంద్ర ప్రభుత్వం దాడులు తీవ్రం చేసిందని విమర్శించారు. కేంద్రం ప్రశ్నించే గొంతుకులపై నేరుగా దాడులకు దిగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేసే సీపీఎంపై కక్ష ధోరణి మానుకొని ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని హితవుపలికారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల, పట్టణ కార్యదర్శులు బండకింది అరుణ్, రాళ్లబండి నాగరాజు, నాయకులు నర్సిరెడ్డి, ప్రభాకర్, శోభ, శ్రీహరి, భాస్కర్, మల్లేశం, రాజు, మైసయ్య, సిద్ధులు, రాములు తదితరులు పాల్గొన్నారు.


