తడిసిన ధాన్యం కొంటాం
వర్షంలోనే రైతుల పాట్లు
ఆగం చేసిన వాన
● కొనుగోలు కేంద్రాల్లో తడిసిముద్దయిన ధాన్యం
● కాపాడుకునేందుకు అన్నదాత పాట్లు
దుబ్బాక/సిద్దిపేటజోన్: గాలి దుమారంతో కూడిన వర్షం రైతులను ఆగం జేసింది. జిల్లాలోని పలు గ్రామాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు వాన దంచికొట్టింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది. ఎండిన ధాన్యం సైతం తడిసిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు. దుబ్బాక, సిద్దిపేట, చిన్నకోడూరు, మిరుదొడ్డి, తొగుట, కొండపాక, నంగునూరు, గజ్వేల్, వర్గల్, భూంపల్లి–అక్బర్పేట, దౌల్తాబాద్ మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అంతా తడిసిపోయింది. ప్రధానంగా దుబ్బాక, సిద్దిపేట మార్కెట్యార్డుల్లో పెద్ద ఎత్తున ధాన్యం తడవడమేకాక, కాంటాలు పెట్టిన వడ్లబస్తాలు సైతం తడిసిపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మరోవైపు చాలా వరకు ధాన్యం వరదనీటిలో కొట్టుకుపోయింది.
వరదలో కొట్టుకుపోతున్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు దుబ్బాక మార్కెట్యార్డుతో పాటు పలుకొనుగోలు కేంద్రాల్లో రాత్రి వేళ వర్షంలోనే రైతులు పడరానిపాట్లు పడ్డారు. కాంటాలు పెట్టించిన ధాన్యం బస్తాలు సైతం తడిసిపోయాయి. ఏ రైతును కదిలించినా కన్నీరు పెట్టడమే తప్ప వారినోటి నుంచి మాటలు రాని పరిస్థితి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి కొనుగోళ్లను వేగిరం చేయాలని రైతులు కోరారు.


