సిద్దిపేటఅర్బన్: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలు సజావుగా సాగుతోందని, ఏఎంసీలలో మాత్రమే మొక్కజొన్న కొనుగోలు జరుగుతోందని అన్నారు. తేమ శాతం వచ్చి లిఫ్ట్ చేయడానికి రెడీగా ఉన్న ధాన్యాన్ని లారీలు వచ్చే వరకు ఆగకుండా అందుబాటులో ఉన్న వాహనాల ద్వారా ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని ఆదేశించారు. అన్ని కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలని, తాగునీరు, టెంట్, యంత్రాలు, కవర్లు, సుతిల్ దారాలు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అధికారులు అప్రమత్తంగా ఉండి రైతులకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సూచించారు.
యుద్ధప్రాతిపాదికన ధాన్యం తరలించాలి
సిద్దిపేటరూరల్: ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఈ పది రోజులు అత్యంత కీలకమని, ప్రత్యేక ప్రణాళికతో వాహనాలతో యుద్ధ ప్రాతిపాదికన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంపై సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోళ్ల ప్రక్రియలో అధికారులందరూ సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. హమాలీ, ట్రాన్స్పోర్టు, సమస్య తలెత్తకుండా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. అకాలవర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట ఆర్డీఓ సదానందం, గజ్వేల్ ఆర్డీఓ చంద్రకళ, హుస్నాబాద్ ఆర్డీఓ రామ్మూర్తి, డీసీఎస్ఓ తనూజ, డీఎం గోపికృష్ణ, డీఆర్డీఓ జయదేవ్ఆర్యా, జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్, జిల్లా సహకార అధికారి వరలక్ష్మి, మార్కెటింగ్ అధికారి నాగరాజు, డీఏఓ స్వరూపారాణి పాల్గొన్నారు.
కలెక్టర్ హైమావతి
మిట్టపల్లిలో కొనుగోలు కేంద్రం పరిశీలన


