కలెక్టరేట్ ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగుల నిరసన
● ఎంప్లాయీస్ జేఏసీ డిమాండ్ ● కలెక్టరేట్ ఎదుట నిరసన
సిద్దిపేటరూరల్: విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల బకాయిలన్నీ చెల్లించాల్సిందేనని టీజీఈజేఏసీ జిల్లా నాయకులు గ్యాదరి పరమేశ్వర్, విక్రంరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగ విరమణ పొందిన వారికి బకాయిలను చెల్లించాలన్నారు. హెల్త్కార్డులుపై నగదు రహిత వైద్యం, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి
గజ్వేల్: ఉద్యోగుల ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం గజ్వేల్లోని ఐఓసీ ఎదుట పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఐక్యకార్యాచరణ కమిటీ నాయకులు మాట్లాడుతూ ఉద్యోగులకు రావాల్సిన రెండు పీఆర్సీలను, పెండింగ్లో ఉన్న డీఏలను వెంటనే అందించాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు అందాల్సిన అన్ని రకాల బెనిఫిట్లను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఎన్జీఓల సంఘం గజ్వేల్ తాలూకా కార్యదర్శి రాజశేఖర్రెడ్డి, కోశాధికారి ప్రవీణ్, జిల్లా ఉపాధ్యక్షులు నాగభూషణం, వెంకట్, మహిళా విభాగం నాయకురాలు జబినా సుల్తానా, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సత్యనారాయణరెడ్డి, లింగం, వలీ అహ్మద్, సత్యనారాయణ, శ్రీనివాస్, సీపీఎస్ ఉద్యోగుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే
గజ్వేల్లోని జిల్లా ఆస్పత్రి ప్రాంగణంలో మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ గజ్వేల్ శాఖ అధ్యక్షుడు శ్రీనివాసచారి ఆధ్వర్యంలో వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేశారు.
నల్లబ్యాడ్జీలతో నిరసన
సిద్దిపేటఎడ్యుకేషన్: సమస్యలు పరిష్కరించాలంటూ శుక్రవారం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాల ఆవరణలో భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలతో ఉద్యోగ సంఘాల నాయకలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీజీసీటీఏ, టీఎన్జీఓ, టీజీఓల ప్రతినిధులు మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చూపక పోవడం విచారకరమన్నారు.


