ఉద్యోగులంటే సర్కార్కు చిన్నచూపు
యూజీడీ(అండర్ గ్రౌండ్ డ్రైనేజీ) వ్యవస్థ అందుబాటులోకి వచ్చినా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో మురుగు ఏరులై పారుతూనే ఉంది. మురుగంతా కాల్వల ద్వారా చెరువుల్లో చేరి ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారింది. యూజీడీ ద్వారా ఇంకా పూర్తిస్థాయి కనెక్షన్లు ఇవ్వకపోవడం, లీకేజీలే ఇందుకు కారణమని స్పష్టమవుతోంది.
– గజ్వేల్
గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో రూ.155కోట్ల వ్యయంతో యూజీడీ పనులు పూర్తయ్యాయి. 130 కిలోమీటర్ల మేర పైప్లైన్ల నిర్మాణం, నాలుగు చోట్ల ఎస్టీపీ(సేవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్)లను ఏర్పాటు చేశారు. విలీన గ్రామాలు ముట్రాజ్పల్లి, క్యాసారం, ఆర్అండ్ఆర్ కాలనీ, రాజిరెడ్డిపల్లి, సంగుపల్లి, సంగాపూర్ మినహా గజ్వేల్, ప్రజ్ఞాపూర్లలో ఈ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. యూజీడీ నిర్మాణం జరిగాక.. పట్టణం మురుగురహితంగా మారుతుందని అంతా భావించారు. కానీ పరిస్థితి భిన్నంగా తయారైంది.
పైప్లైన్లకు లీకేజీలు
యూజీడీ పనులు లోపభూయిష్టంగా సాగటం వల్ల పలు కాలనీల్లో నిర్మించిన పైప్లైన్లకు లీకేజీలు ఏర్పడ్డాయి. మరోవైపు కొన్ని చోట్ల చాంబర్లు ధ్వంసమయ్యాయి. ఫలితంగా జనావాసాల్లోకి మురుగునీరు పారుతోంది. ఎక్కడైనా యాజీడీ చాంబర్ల నిండితే.. వాటిని క్లియర్ చేయాల్సిన జెట్టింగ్ యంత్రం ఈ మున్సిపాలిటీకి అందుబాటులో లేదు. రూ.155కోట్లతో పనులు చేపట్టిన కాంట్రాక్ట్ ఏజెన్సీకి రూ.30కోట్లకుపైగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఈ సాకుతో సదరు కాంట్రాక్ట్ ఏజెన్సీ మున్సిపాలిటీకి జెట్టింగ్ యంత్రం సమకూర్చలేదు. ఫలితంగా యూజీడీ నిండినా, లీకేజీల ఏర్పడితే సరిగా క్లియర్ చేయడం లేదు. యూజీడీ పనులు పూర్తయిన గజ్వేల్, ప్రజ్ఞాపూర్లలో 11వేలకు ఇండ్లు ఉండగా.. కేవలం 9వేల లోపు కనెక్షన్లు ఇచ్చారు. యూజీడీ కనెక్షన్లు లేని ఇళ్ల నుంచి మురుగు వీధుల్లో పారుతోంది. ప్రజ్ఞాపూర్లోని మురుగు రాజిరెడ్డిపల్లి కుంట అక్కడి నుంచి క్యాసారం కుంటలోకి చేరుతోంది. జాలిగామ బైపాస్ ప్రాంతం, తూప్రాన్ రోడ్డు వైపున ఉన్న పెట్రోల్ బంకుల వద్ద నుంచి మురుగునీరు పాండవుల చెరువులోకి చేరుతోంది. అంతేకాకుండా పార్శికుంట, ప్రజ్ఞాపూర్లోని ఊర చెరువుల్లోకి సైతం మురుగు వెళ్తోంది.
భరించలేని దుర్గంధం
గతంలో ఈ చెరువులు, కుంటలను పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దారు. పాండవుల చెరువును మినీ ట్యాంక్బండ్గా మార్చారు. కానీ ఈ చెరువు వద్ద ఆహ్లాదం కోసం వెళ్తే దుర్గంధమే వ్యాపిస్తోంది. మిగతా చెరువులు, కుంటల్లోనూ ఇదే దుస్థితి. ఈ దుస్థితి మారాలంటే పూర్తిస్థాయిలో యూజీడీ కనెక్షన్లు ఇవ్వడమేకాకుండా, లీకేజీలను నివారించాల్సి ఉంది.
చర్యలు చేపడతాం
పట్టణంలోని యూజీడీ నిర్వహణలో లోపాలను గుర్తిస్తాం. మున్సిపాలిటీలోని చెరువుల్లోకి మురుగునీరు చేరడానికి కారణాలపై పరిశీలన జరుపుతాం. దీనిపై త్వరలోనే చర్యలు తీసుకుంటాం.
– వెంకటగోపాల్, మున్సిపల్ కమిషనర్
రిటైర్డ్ ఉద్యోగులను రోడ్లపైకి తెచ్చారు
మాజీ మంత్రి హరీశ్రావు
ప్రజారోగ్యానికి పెనుముప్పు
రూ.155కోట్లతో యూజీడీ నిర్మించినా
ప్రయోజనం శూన్యం
పూర్థిసాయి కనెక్షన్లు ఇవ్వకపోవడం..
లీకేజీలే కారణం
గజ్వేల్ మున్సిపాలిటీ దుస్థితి


