మల్లన్న నామస్మరణతో మార్మోగిన కొమురవెల్లి
కొమురవెల్లి మల్లన్నస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి వారం భక్తులు పోటెత్తారు. ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మారుమోగాయి. వేకువజామునే భక్తులు పుష్కరిణిలో స్నానమాచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. కొంత మంది భక్తులు గంగిరేణు చెట్టువద్ద ముడుపులు, పట్నాలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. కాగా ఆదివారం అర్ధరాత్రి నిర్వహించిన అగ్నిగుండాలతో ఉత్సవాలు ముగిశాయి.
– కొమురవెల్లి(సిద్దిపేట)


