ప్రశాంత్నగర్(సిద్దిపేట): వేసవికాలం దృష్ట్యా ఒంటిపూట బడులను నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలోని 980 ప్రభుత్వ పాఠశాలలు, 250 ప్రైవేట్ పాఠశాలల్లో 1.3లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. సోమవారం నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట పాఠశాలలు నిర్వహించనున్నారు. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు తరగతులు కొనసాగనున్నాయి. పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్న పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు.
చక్కగా చదివి
ఉన్నతస్థాయికి చేరాలి
నంగునూరు(సిద్దిపేట): విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా చక్కగా చదివి ప్రయోజకులు కావాలని డీఈఓ శ్రీనివాస్రెడ్డి అన్నారు. పాలమాకులలోని స్కూల్ వార్షికోత్సవం పురస్కరించుకొని ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. టీఈడీఎస్ ఆధ్వర్యంలో జాతీయస్థాయి చిల్డ్రన్లీగ్ ఒలింపియాడ్లో మూడో ర్యాంక్ సాధించిన పాఠశాల విద్యార్థి చైత్రకు డీఈఓ బహుమతి అందజేశారు. కార్యక్రమంలో ఎంఈఓ దేశిరెడ్డి, ఎస్ఐ వివేక్ తదితరులు పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్ సేవలు
అభినందనీయం
ఎంపీ రఘునందన్రావు
గజ్వేల్: లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని మెదక్ ఎంపీ రఘునందన్రావు కొనియాడారు. ఆదివారం గజ్వేల్లోని ప్రజ్ఞా గార్డెన్స్లో లయన్స్ క్లబ్ సిద్దిపేట రీజియన్ స్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక అంశాలను ప్రాతిపదికగా తీసుకొని సేవా కార్యక్రమాలను చేపడుతూ లయన్స్ క్లబ్ ప్రతినిధులు అందరి మన్ననలనూ చూరగొంటున్నారన్నారు. సేవా కార్యక్రమాలకు తనవంతు సహకారమందిస్తానని చెప్పారు. ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ డైరెక్టర్ బాబురావు మాట్లాడుతూ ప్రపంచంలోని 200దేశాల్లో తమ క్లబ్ సేవలు కొనసాగుతున్నాయని చెప్పారు. రీజియన్ చైర్మన్ సంజయ్ గుప్త అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో మహిళా విభాగం అధ్యక్షురాలు సుమలత గుప్త, లయన్స్ క్లబ్ జాతీయ నాయకులు అమర్నాథ్, ప్రకాశ్రావు, విజయలక్ష్మీ, నర్సింహ్మారాజు, సూర్యారావు, స్థానిక ప్రతినిధులు ఉప్పల మెట్టయ్య, సత్యనారాయణ, పరమేశ్వరాచారి తదితరులు పాల్గొన్నారు.


