రేపటి నుంచే మూల్యాంకనం
ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఆదివారం నుంచి ప్రారంభం అవుతుందని డీఐఈఓ రవీందర్రెడ్డి చెప్పారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల(కోడ్యుకేషన్)లో మూల్యాంకన కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గణితం, ఇంగ్లిష్, హిందీ, తెలుగు, పొలిటికల్సైన్స్ సబ్జెక్టులకు సంబంధించిన అధ్యాపకులు మూల్యాంకన కేంద్రంలో ఉదయం 10గంటలలోగా రిపోర్టు చేయాలన్నారు. మూల్యాంకన విధులకు హాజరు కాని అధ్యాపకులపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.
సిద్దిపేటఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. శుక్రవారం చివరి రోజు విద్యార్థులు ఉత్సాహంగా బయటకు వచ్చారు. పరీక్షలకు ఫస్టియర్ విద్యార్థులు 98శాతం, సెకండియర్ విద్యార్థులు 96 శాతం మంది హాజరైనట్లు డీఐఈఓ రవీందర్రెడ్డి తెలిపారు. జనరల్, ఒకేషనల్ బ్రిడ్జ్కోర్సు, మైనర్ మీడియా పరీక్షలు మినహా ప్రధాన పరీక్షలు ముగిశాయన్నారు. మొత్తంలో ఒక విద్యార్థిపై మాల్ప్రాక్టీస్ కేసు మినహా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పరీక్షలు విజయవంతంగా ముగిసినట్లు చెప్పారు. పరీక్షల నిర్వహణకు సహకరించిన అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.


