జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి
అక్కన్నపేట(హుస్నాబాద్): సహజ పద్ధతిలో పంటలను సాగుచేసి అధిక దిగుబడులు పొందాలని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి అన్నారు. అక్కన్నపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం వ్యవసాయంపై రైతులు, శాస్త్రవేత్తల చర్చా గోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా సహజ వ్యవసాయం పద్ధతులు, రసాయనాల వినియోగం తగ్గించడం, పంట మార్పిడి, నూనె గింజల సాగుపై అవగాహన కల్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతులందరూ భూసార పరీక్షలు చేయించుకోవాలన్నారు. మట్టిలో ఉండే పోషకాలను తెలుసుకొని పంటల వేయాలన్నారు. పచ్చిరొట్ట ఎరువులు వాడకంపై కూడా రైతులకు అవగాహన కల్పించారు.
సేంద్రియంవైపు మొగ్గు చూపాలి
పథకాలను సద్వినియోగం చేసుకోండి: సీపీ రష్మీ
సిద్దిపేటజోన్: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ పిలుపునిచ్చారు. మూడు రోజులుగా విపంచి ఆడిటోరియంలో కొనసాగిన పీఎం విశ్వకర్మ లబ్ధిదారుల ఉత్పత్తుల ప్రదర్శన, ట్రేడ్ ఫెయిర్ ముగింపు కార్యక్రమంలో బుధవారం ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సృజనాత్మక ఆలోచనలకు పదును పెట్టాలని సూచించారు. వృత్తి నైపుణ్యాలను సాధించాలన్నారు. చిత్రలేఖనం, టైలరింగ్, కంప్యూటర్, పెయింటింగ్ లాంటివి నేర్చుకోవాలన్నారు. అనంతరం ఎగ్జిబిషన్, ట్రేడ్ ఫెయిర్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురికి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమ సంస్థ డైరెక్టర్ రావు, పీఎం విశ్వకర్మ పథకం రాష్ట్ర కో ఆర్డినేటర్ అమినా భాను, ప్రతినిధులు పాల్గొన్నారు.
హక్కుల సాధనకు పోరాటం
చిన్నకోడూరు(సిద్దిపేట): హక్కుల సాధనకు కార్మికులు సంఘటితంగా పోరాడాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కనకయ్య పిలుపునిచ్చారు. బుధవారం చిన్నకోడూరులో హమాళీ కార్మికులతో కలిసి మాట్లాడారు. అన్ని రంగాల్లో పని చేస్తున్న అసంఘటిత కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల పక్షాన సీఐటీయూ నిరంతరం పోరాడుతోందన్నారు. సమావేశంలో నాయకులు కాటం మధు, శ్రీనివాస్రెడ్డి, భాస్కర్, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
15న కవి సమ్మేళనం
గజ్వేల్రూరల్: కవి సమ్మేళనం ఈనెల 15న నిర్వహిస్తున్నట్లు గజ్వేల్ డివిజన్ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు దేశపతి శంకరశర్మ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణంలోని శ్రీసత్యసాయి బాబా మందిరంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనంతో పాటు పంచాంగ ఆవిష్కరణ జరుగుతుందన్నారు. కార్యక్రమానికి హాస్య బ్రహ్మ డాక్టర్ శంకరనారాయణ వస్తున్నారని తెలిపారు. కవి సమ్మేళనంలో పాల్గొనే కవులు తమ పేర్లను 9849302525 నంబర్కు ఫోన్ చేసి నమోదు చేసుకోవాలని సూచించారు.
మల్లన్న ఆలయంలో
వేలం పాట
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జునస్వామి ఆలయంలో పలు అంశాలకు బహిరంగా వేలం పాటలను ఈఓ కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో ఏఈఓలు సుదర్శనం, బుద్ది శ్రీనివాస్, పర్యవేక్షకులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన సిద్ధి హోమం
మిరుదొడ్డి(దుబ్బాక): మండల కేంద్రమైన మిరుదొడ్డిలో మూడ్రోజులుగా నిర్వహిస్తున్న రేణుకా– జమదగ్ని ఏకాదశ సిద్ధిహోమం బుధవారం ముగిసింది. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండుగ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు.


