ప్రభుత్వ ప్రోత్సాహకాలనుసద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ హైమావతి
‘ప్రగతి ప్రణాళిక’ను
పక్కాగా చేపట్టాలి
సిద్దిపేటరూరల్: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలోని కార్యక్రమాలు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జిల్లా వ్యాప్తంగా పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో అధికారులతో ప్రజా పాలన ప్రగతి ప్రాణాళిక కార్యక్రమం అమలుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ శాఖల వారీగా నిర్దేశించిన కార్యక్రమాలను పర్యవేక్షించాలన్నారు. అన్ని సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూల్స్, ఇతర విద్యాసంస్థలలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి శుభ్రం చేయాలన్నారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో వాహనాల డ్రైవర్లకు వైద్యారోగ్యశాఖ సహాకారంతో కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీరు సమస్య తలెత్తకుండా గ్రామాల్లో, మున్సిపాలిటీలలో ఏర్పాట్లు చేయాలని, గృహ అవసరాలకు , వ్యవసాయ అవసరాలకు సరఫరా చేస్తున్న విద్యుత్ స్తంభాలు , విద్యుత్ వైర్లను సరిచేయాలన్నారు. ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు తీసుకోవాలన్నారు. 14 నుంచి 15 సంవత్సరాలలోపు పిల్లలకు జిల్లా వ్యాప్తంగా హెచ్పీవి వ్యాక్సినేషన్ చేయించాలన్నారు. 12న ప్రగతి ప్రణాళికా కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించాలన్నారు.
సిద్దిపేటఅర్బన్: ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అందించే వివిధ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలని కలెక్టర్ హైమావతి అన్నారు. సోమవారం అర్బన్ మండలం ఎల్లుపల్లి శివారులోని జిల్లా మహిళా సమాఖ్య భవనంలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మహిళలో ఉన్న శక్తి సామర్థ్యాలను తెలుసుకొని రాణించాలన్నారు. మీ పిల్లలను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దాలని సూచించారు. క్రమశిక్షణ, పట్టుదలతో పనిచేసి ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. అనంతరం ఖరీఫ్, రబీ సీజన్ ధా న్యం మార్కెంటింగ్ కమిషన్ డబ్బులకు సంబంధించిన రూ. 12.36 కోట్ల చెక్కును మహిళా సమాఖ్య సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో డీఆర్డీఓ జయదేవ్ఆర్య, డీఆర్ఓ నాగరాజమ్మ, డీఏఓ స్వరూపరాణి, డీహెచ్ఎస్ఓ సువర్ణ, కోఆపరేటివ్ అధికారి వరలక్ష్మి, తూనికలు, కొలతల శాఖ అధికారి, మహి ళా సమాఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


