ప్రజల రక్షణకు ఏర్పాటు తప్పనిసరి
సీపీ రష్మీ పెరుమాళ్
పలు గ్రామాల్లో 200కు పైగాసీసీ కెమెరాలు ప్రారంభం
సిద్దిపేట సురక్ష నేత్ర లోగో ఆవిష్కరణ
సిద్దిపేటకమాన్: ప్రజారక్షణకు సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి అని సీపీ రష్మీ పెరుమాళ్ అన్నారు. పోలీసు కమిషనరేట్లో సోమవారం సిద్దిపేట సురక్ష నేత్ర లోగోను పోలీసు అధికారులతో కలిసి ఆమె ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఒక్కరోజే పలు గ్రామాల్లో 200కు పైగా సీసీ కెమెరాలను ప్రారంభించామన్నారు. ఏదైనా ఘటన జరిగినపుడు ప్రజలు స్పందించి పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సీసీ కెమెరాలు నేరాల నియంత్రణలో కీలకంగా మారనున్నాయన్నారు. సిద్దిపేట సురక్ష నేత్ర ద్వారా కనెక్టెడ్ విలేజెస్.. ప్రొటెక్టెడ్ కమ్యూనిటీస్ అనే ట్యాగ్ లైన్తో ముందుకు వెళ్లడం జరగుతుందన్నారు. జిల్లాలోని మండల కేంద్రాలు, గ్రామాలు, కామన్ ఏరియాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటికి జియో ట్యాగింగ్ చేయనున్నట్లు తెలిపారు. అనుమానిత వ్యక్తుల కదలికలపై స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. జిల్లాలో ఇప్పటికే 6వేలకు పైగా ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ జియో ట్యాగింగ్ చేయిస్తున్నామని, వాటిని పోలీసు కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో బెల్ట్ షాప్లపై, అక్ర మ ఇసుక రవాణ, గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల వినియోగం, రవాణపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలయాలు, విద్యా సంస్థల సమీపంలో, ఇతర బహిరంగ ప్రదేశంలో మద్యం తాగినా, తాగి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, ఏఆర్ అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఏసీపీ రవీందర్రెడ్డి, హుస్నాబాద్ ఏసీపీ సదానందం, గజ్వేల్ ఏసీపీ నర్సింహులు, ఎస్బి సీఐ శ్రీధర్ గౌడ్, కిరణ్, పీఆర్ఓ ప్రవీణ్ పాల్గొన్నారు.


