ఫోన్ ట్యాపింగ్ అతి నీచమైనది
హుస్నాబాద్: అధికారులపై, రాజకీయ నాయకులపై, వారి కుటుంభ సభ్యులపై ఫోన్ ట్యాపింగ్ చేయడం అతి నీచమైనదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సోమవారం హుస్నాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం విలేకరులతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి సిట్ అధికారులు విచారణకు పిలిస్తే దానిని రాద్ధాంతం చేయడం బీఆర్ఎస్ నాయకులకే చెల్లించదన్నారు. మరోవైపు హింసాత్మక నిరసనలకు పిలుపునిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. కొంత మంది జీవితాల్లో, ఆర్థిక, వ్యాపార, ఉద్యోగ, కుటుంబాల పరంగా వాళ్ల వ్యక్తిగత ఫోన్ ట్యాపింగ్ చేసి సమాచారాన్ని సేకరించారని తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఇందులో కక్ష సాధింపు, కుట్ర పూరితమైన అంశాలు లేవన్నారు. మీరు తప్పు చేయనట్లయితే విచారణలో మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలన్నారు. అంతేకాని డైవర్షన్ పాలిటిక్స్తో రాజకీయ లబ్ధి ప్రచారాన్ని మానుకోవాలని మంత్రి సూచించారు. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ చేపడుతున్న సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్


