జెండా తలకిందులు!
గణతంత్ర వేడుకల్లో అపశ్రుతి
దుబ్బాక: పట్టణంలో సోమవారం జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేశారు. దీంతో వెంటనే మున్సిపల్ అధికారులు, అక్కడున్న వారు గమనించి జెండాను కిందికి దింపి సరిచేశారు. అనంతరం మళ్లీ ఎగురవేశారు. దీంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. సంఘటనపై విచారించి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ను ఎమ్మెల్యే ఆదేశించారు.
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
జెండా ఆవిష్కరించిన అనంతరం ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా, ఏం చేయడం లేదని విమర్శించారు. దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రసంగానికి అడ్డుతగిలారు. అంతే కాకుండా ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అతికష్టం మీద ఇరువర్గాలను వారించి ఎమ్మెల్యేను పంపించారు. జాతీయ జెండాను అవమానించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.


