‘ఉపాధి’ రద్దుకు కేంద్రం కుట్ర
అందుకోసమే ‘వీబీ జీ రామ్జీ’గా పేరు మార్పు
ఉపాధి కూలీలకు అండగాపోరాటం చేస్తాం
ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావత్
గజ్వేల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని రద్దు చేయాలనే కుట్ర సాగిస్తున్నదని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావత్ ఆరోపించారు. శుక్రవారం గజ్వేల్ మండలం దాచారంలో మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డిలతో కలిసి ఉపాధి హామీ కూలీలు, రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం అవలంబిస్తున్న విధానాలపై మండిపడ్డారు. ఉపాధి హామీ పథకానికి కేంద్రం నుంచి ఇవ్వాల్సిన 60శాతం నిధుల్లో కోత విధించే కుట్రలో భాగంగానే.. ఈ పథకానికి ‘వీబీ జీరామ్జీ’ పేరును మార్చారని మండిపడ్డారు. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలపై భారాన్ని మోపాలని చూస్తున్నదని చెప్పారు. లేబర్ కోడ్ల పేరుతో కార్మికుల హక్కులను సైతం కేంద్రం కాలరాస్తున్నదని విమర్శించారు. దేశంలో కూలీలు ఉపాధిలేక అల్లాడుతున్న తరుణంలో యూపీఏ ప్రభుత్వం కామన్ మినీమమ్ ప్రోగ్రామ్లో భాగంగా.. మహత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ఇలాంటి మహత్తర పథకంపై కుట్రలను సహించేదీలేదన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉపాధికూలీలు ఈ పథకం తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. వారి హక్కులను కాపాడటానికి పోరాటాన్ని ముమ్మరం చేస్తామన్నారు.
జీ రామ్ జీ బిల్లు రద్దు చేయాల్సిందే
చిన్నకోడూరు(సిద్దిపేట): పార్లమెంట్లో ప్రవేశపెట్టిన జీ రామ్ జీ బిల్లును వెంటనే రద్దు చేయాలని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావత్ డిమాండ్ చేశారు. శుక్రవారం చిన్నకోడూరులో ఏర్పాటు చేసిన ఉపాధి హామీ కూలీల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వానికి పేదలపై, గ్రామ పంచాయతీల అభివృద్ధిపై చిత్త శుద్ధిలేదన్నారు. కాంగ్రెస్తోనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు.
వాగ్వాదం.. తోపులాట
పార్టీ మండల అధ్యక్షుడికే సమావేశం గురించి సమాచారం ఇవ్వలేదంటూ మీసం మహేందర్ తన అనుచరులతో కలిసి సచిన్ సావత్కు వివరించారు. దీంతో మరో వర్గం నాయకులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.
‘ఉపాధి’ రద్దుకు కేంద్రం కుట్ర


