వసంత పంచమికి సన్నాహాలు
● విద్యాధరిలో విస్తృత ఏర్పాట్లు ● వర్గల్కు పోటెత్తనున్న భక్తజనం ● ప్రత్యేక క్యూలైన్లు, ప్రాంగణంలో టెంట్లు
వర్గల్(గజ్వేల్): వసంత పంచమి వేళ సుప్రసిద్ధ వర్గల్ క్షేత్రానికి భక్తులు పోటెత్తనున్నారు. శుక్రవారం ఈ మహోత్సవం సందర్భంగా క్షేత్రంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడటమే ప్రధాన లక్ష్యంగా విశాలమైన చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎండ వేడిమికి ఆస్కారం లేకుండా క్యూలైన్ మార్గంలోనూ నీడనిచ్చే ఏర్పాట్లు చేపట్టారు. క్షేత్రానికి దాదాపు 50 వేల మంది భక్తులు వస్తారని, అదే స్థాయిలో 10,000 పైగా చిన్నారుల అక్షరాభ్యాసాలు జరుగుతాయనే అంచనాలతో నాలుగు చోట్ల అక్షరాభ్యాస మండపాలు సిద్ధం చేస్తున్నారు. బారికేడ్లు, వాహనాల పార్కింగ్, పర్యవేక్షణకు రెండు చెక్పోస్టులు, క్షేత్రంలో కాంతిమంతంగా లైట్లు, ఆలయానికి రంగురంగుల దీపాల వరుసలు, స్వాగత తోరణాల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
వర్గల్ క్షేత్రం సందర్శించిన ఏసీపీ
వసంత పంచమి మహోత్సవం పురస్కరించుకుని భక్తుల తాకిడి దృష్ట్య గజ్వేల్ ఏసీపీ నర్సింహులు, రూరల్ సీఐ రవిరాజు, ఎస్ఐ కరుణాకర్రెడ్డి వర్గల్ క్షేత్రం సందర్శించారు. అక్కడ పార్కింగ్ స్థలం, క్యూలైన్లు, చెక్పోస్టు ఏర్పాటు తదితర అంశాలను ఆలయ వర్గాలతో సమీక్షించారు. కాగా క్షేత్రంలో భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ప్రశాంతంగా అమ్మవారి సన్నిధిలో శ్రీపంచమి వేడుకలు ఘనంగా నిర్వహించుకునేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆలయ వ్యవస్థాపక చైర్మన్ యాయవరం చంద్రశేఖర సిద్ధాంతి తెలిపారు. చిన్నారుల అక్షరాభ్యాసాల కోసం ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రతి భక్తునికి మహాప్రసాదం (అన్నదానం) అందేలా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. క్షేత్రానికి ఆర్టీసీ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. శుక్రవారం శ్రీపంచమి మహోత్సవ వేడుకలు భక్తులు తిలకించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.
వసంత పంచమికి సన్నాహాలు


