పుల్లూరు జాతరలో వినూత్నం
అఖండ దీపం వెలిగిస్తూ మొక్కులు
800 ఏళ్లుగా ఆనవాయితీ
సాక్షి, సిద్దిపేట: పుల్లూరు జాతరలో భక్తి అఖండం.. ఇక్కడ గురిగీలే ప్రధానం. గురిగిలో నూనె తీసుకెళ్లి అంఖడ దీపం వెలిగించి మొక్కులు తీర్చుకోవడం ఇక్కడ ప్రత్యేకం. ఈ ఆనవాయితీ 800 ఏళ్లుగా వస్తుండటం విశేషం. సాధారణంగా ఏ దేవాలయమైనా అఖండ దీపానికి నూనె పావులతో పోస్తుంటారు. సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరులో ప్రసిద్ధిచెందిన స్వయంభూ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో నూనెను చిన్న గురిగిలో తీసుకువచ్చి అఖండ దీపంలో పోస్తుంటారు. పుల్లూరు బండజాతరకు భక్తులు జిల్లా నుంచే కాకుండా సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చారు. లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న తర్వాత చిన్న గురిగిలో నూనె తీసుకవెళ్లి ధ్వజస్తంభం దగ్గర ఉన్న అఖండ దీపంలో పోయడం ఏళ్లుగా భక్తులు ఆచరిస్తున్నారు. ప్రత్యేకంగా తయారు చేసిన గురిగిని నూనె తో కలిపి రూ.20లకు విక్రయిస్తున్నారు. భక్తు లు కొనుగోలు చేస్తూ మొక్కులు తీర్చుకున్నారు. కాగా బుధవారంతో జాతర ముగిసింది.


