గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
గజ్వేల్రూరల్: గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని వర్గల్ (ప్రజ్ఞాపూర్) సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ 2026–27 విద్యాసంవత్సరానికి తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 5వ తరగతితో పాటు 6 నుంచి 9వ తరగతిలో విద్యనభ్యసించేందుకు ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 25లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 22న ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.
మోడల్ స్కూళ్లలో..
ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలోని అన్ని మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో, 7 నుంచి 10 వరకు మిగిలిన సీట్ల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఆసక్తి కల్గిన విద్యార్థులు ఈ నెల 28 నుంచి వచ్చే నెల 28 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు దగ్గరిలోని మోడల్ స్కూల్ను సంప్రదించాలని ఆయన సూచించారు.
విద్యార్థుల అభ్యున్నతికి
కృషి చేయండి: డీఈఓ
దుబ్బాక: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు అంకిత భావంతో కృషి చేయాలని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్రెడ్డి అన్నారు. బుధవారం దుబ్బాక మండలం పధ్మనాభునిపల్లిలోని ప్రాథమికోన్నత పాఠశాలలోని 110 మంది విద్యార్థులకు హెచ్ఎం పెద్ది మల్లికార్జున్ రూ.40 వేల తన సొంత ఖర్చులతో క్రీడాదుస్తులను డీఈఓ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఎంను ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వ పాఠశాలల బలోపేతంతో పాటు ెపేద విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. అలాగే దుబ్బాక మున్సిపల్లోని చేర్వాపూర్ పాఠశాలను సందర్శించారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రభుదాసు, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.
ఇష్టంతో చదవండి..
ఉత్తమ ఫలితాలు సాధించండి
సాంఘిక శాస్త్ర ఫోరం ప్రతినిధులు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): విద్యార్థులు తమ సమయాన్ని సద్వినియోగం చేస్తూ ఇష్టంతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని సాంఘికశాస్త్ర ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీదేవి, జిల్లా అధ్యక్షుడు పూర్ణచందర్రావు విద్యార్థులకు సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మల్టిపర్పస్ ఉన్నత పాఠశాలలో జిల్లా సాంఘికశాస్త్ర ఫోరం ఆధ్వర్యంలో ప్రతిభా పోటీ పరీక్షలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు ప్రశాంస పత్రాలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని సబ్జెక్ట్లలో మార్కులు సాధించినపుడే ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతారని, విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో డివిజన్ కో ఆర్డినేటర్ భూపాల్ తదితరులు పాల్గొన్నారు.
కాంప్లెక్స్ సమావేశాలను
రీ షెడ్యూల్ చేయండి
ప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల కాంప్లెక్స్ సమావేశాలను రీ షెడ్యూల్ చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ కోరారు. ఈ మేరకు బుధవారం టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో విద్యాశాఖ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ఈనెల 26న గణతంత్ర దినోత్సవం ఉన్న నేపథ్యంలో పాఠశాలల్లో విద్యార్థులకు క్రీడాపోటీలు, గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. దీంతో రీ షెడ్యూల్ చేయాలని కోరామన్నారు.
గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం


