చెరువుల అభివృద్ధికి నిధులు మంజూరు
హుస్నాబాద్: పట్టణంలోని కొత్త చెరువు, ఎల్లమ్మ చెరువు అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త చెరువు పునరుద్ధరణ, అభివృద్ధి పనుల కోసం రూ.7.49 కోట్లు, ఎల్లమ్మ చెరువు నీటి పారుదల కాలువల పునరుద్ధరణకు ఇరిగేషన్ శాఖ నుంచి రూ.2.74 కోట్లు నిధులు కేటాయిస్తూ పరిపాలన అనుమతులు జారీ చేసింది. నిధులు కేటాయించడంపై సీఎం రేవంత్రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు.
నేడు విద్యుత్ సమస్యల
పరిష్కార వేదిక
ప్రశాంత్నగర్(సిద్దిపేట): విద్యుత్ వినియోగదారుల సమస్యలపై విద్యుత్ అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని విద్యుత్ భవన్లో ఉదయం11 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు పరిష్కార వేదిక నిర్వహించనునట్లు విద్యుత్శాఖ ఎస్ఈ చంద్రశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారుల అడిగే సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపనున్నట్లు తెలిపారు. వినియోగదారులు కరెంట్ బిల్లు రశీదు, ఆధార్ కార్డు తీసుకొని రావాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
అర్జీలు సత్వరమే పరిష్కారం
అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్
సిద్దిపేటరూరల్: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించే అర్జీలను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో ప్రజావాణి కార్యక్రమానికి వస్తారని, వారి నమ్మకాన్ని నిలబెట్టేలా అధికారులు కృషి చేయాలన్నారు. ప్రజావాణిలో మొత్తం 142 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి నాగరాజమ్మ, అధికారులు, కలెక్టరేట్ ఏఓ రాజ్ కుమార్ పాల్గొన్నారు.
కళాశాలల బలోపేతమే లక్ష్యం కావాలి: డీఐఈఓ
23న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్
సిద్దిపేటఎడ్యుకేషన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల బలోపేతమే లక్ష్యంగా కృషి చేయాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి(డీఐఈఓ) రవీందర్రెడ్డి సూచించారు. తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ (టీజీఎల్ఏ) నూతన క్యాలెండర్ను సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఐఈఓ మాట్లాడుతూ కళాశాలల్లో మౌలిక వసుతులు, ప్రయోగశాలల పరికరాలకు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేసినట్లు చెప్పారు. కళాశాలల్లో అడ్మిషన్లు పెంచేందుకు అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ నెల 23న అన్ని కళాశాలల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మీటింగ్కు ప్రతి విద్యార్థి తల్లితండ్రులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.


