హంగులేనా.. వెలుగులేవీ ?
గజ్వేల్ రింగురోడ్డుపై చీకటి ప్రయాణం
● సర్కిళ్ల వద్ద వెలగని సెంట్రల్ లైటింగ్స్ ● వాహనదారుల్లో అయోమయం.. ప్రమాదాలకు మూలం ● రూ.233కోట్లతో అధునాతన ప్రమాణాలతో నిర్మాణం
అధునాతన హంగులతో నిర్మించిన గజ్వేల్ రింగు రోడ్డుపై చీకటి అలుముకోవడంతో ప్రయాణం భయానకంగా మారుతోంది. పట్టణ అవసరాల కోసం రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్మించిన రింగు రోడ్డు ఇది. రూ.233కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ రోడ్డుపై లైటింగ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం.. విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో వాహనదారులు అయోమయానికి గురై ప్రమాదాల బారినపడుతున్నారు. – గజ్వేల్
మాజీ సీఎం కేసీఆర్ చొరవ ఫలితంగా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి కంఠహారంగా రింగు రోడ్డు నిర్మాణం జరిగింది. 2015లో తొలుత రూ.220కోట్ల వ్యయంతో ప్రారంభమైన పనులు వివిధ కారణాలతో ఆగిపోయి.. 2023వరకు కొనసాగాయి. మొత్తం గా ఈ పనుల వ్యయం రూ.233కోట్లకు చేరింది. రోడ్డుకు అంతర్జాతీయ ప్రమాణాలద్దారు. రహదారికి అనుసంధానంగా మరో నాలుగు రేడియల్ రోడ్లు 12.5కిలోమీటర్ల మేర నిర్మాణం జరిగింది. కానీ సంగాపూర్ రోడ్డు వైపున కోర్టు కేసు కారణంగా 200మీటర్ల పనులు పెండింగ్లో ఉన్నాయి. ధర్మా రెడ్డిపల్లి–జాలిగామ గామాల మధ్య రైల్వే బ్రిడ్జి పను లు తుది దశకు చేరుకున్నాయి. దీనివల్ల రింగు రోడ్డు అనుసంధానం ఏడేళ్ల కావస్తున్నా ఇంకా పూర్తి కాలేదు. కానీ పూర్తయిన మేర వినియోగంలోకి తెచ్చారు.
లైటింగ్ వ్యవస్థ అస్తవ్యస్తం
రూ.233కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ఈ రోడ్డుపై లైటింగ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. ప్రస్తుతం ఈ రోడ్డుపై 12 సర్కిళ్లు ఉండగా, ఇందులో పాతూర్, శ్రీగిరిపల్లి, రిమ్మనగూడ జంక్షన్ల వద్దగల ఆరు సర్కిళ్లల్లో మాత్రమే లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ రోడ్డును ప్రారంభించిన కొత్తలో కొంత కాలం సర్కిళ్ల వద్ద లైట్లు వెలిగాయి. కానీ కొన్ని నెలలుగా లైట్లు వెలగక.. రింగు రోడ్డుపై ప్రయాణం చీకట్లోనే సాగుతోంది. ఈ పరిస్థితి ప్రమాదాలకు కారణమవుతోంది.
12 సర్కిళ్ల నిర్మాణం..
రింగు రోడ్డుపై 12 సర్కిళ్ల నిర్మాణం చేపట్టారు. పాతూర్ జంక్షన్ నుంచి రిమ్మనగూడ వరకు ఆరు సిక్స్ లేన్ల సర్కిళ్లు, మరో ఆరు ఫోర్ లేన్ల సర్కిళ్లు ముట్రాజ్పల్లి, వర్గల్ రోడ్డు, తూప్రాన్ రోడ్డు, ధర్మారెడ్డిపల్లి రోడ్డు, జాలిగామ రోడ్డు, పిడిచెడ్ రోడ్డు వద్ద నిర్మించారు. అంతేకాకుండా సెంట్రల్ లైటింగ్, అడ్వాన్స్ డైరెక్షన్ బోర్డులు, మ్యాపు టైపు బోర్డులు, గాంట్రీ బోర్డులు ఏర్పాటు చేసి...సర్కిళ్ల వద్ద పీలీషీయమ్, పగోడ, బోగన్ విల్లా, ఫాక్ స్టైల్, ఫామ్ట్రీ, వేపతోపాటు రంగురంగల పూల మొక్కలు పెంచి ఈ రోడ్డుకు నయాలుక్ తీసుకొచ్చారు.
లైటింగ్ లేక ప్రమాదాలు
ఎన్నో హంగులతో నిర్మించిన గజ్వేల్ రింగు రోడ్డుపై లైటింగ్ లేక.. ప్రయాణం భయాందోళనకు గురిచేస్తోంది. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడంలేదు. వెంటనే ఈ పరిస్థితిని మార్చాలి. లేకపోతే ప్రమాదాలు పెరిగిపోతాయి.
– మంగళపల్లి సత్యనారాయణ,
మున్సిపాలిటీ వాసి
ప్రయాణం వణుకు పుట్టిస్తోంది
గజ్వేల్ రింగు రోడ్డును ఇంత మంచిగా నిర్మించి లైట్లు మాత్రం మరిచిపోయిండ్రు. దీనివల్ల రోడ్డుపైకి రాత్రి వేళ వెళ్లాలంటే జంకే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. సమస్య పరిష్కరించాలి.
– శ్రీనివాస్, మున్సిపాలిటీ వాసి
రింగు రోడ్డుపై రిమ్మనగూడ సర్కిల్ సమీపంలో కమ్ముకున్న చీకటి


