నేటి నుంచి కొండపోచమ్మ జాతర
గజ్వేల్: జగదేవ్పూర్ మండలం తీగుల్నర్సాపూర్ కొండపోచమ్మ జాతర సోమవారం నుంచి ప్రారంభం కానుంది. మార్చి 19వరకు మూడు నెలలపాటు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ ఆలయం హైదరాబాద్–కరీంనగర్ రాజీవ్ రహదారి మార్గంలోని గజ్వేల్ మండలం కొడకండ్ల నుంచి 14కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఏటా ఈ జాతరకు హైదరాబాద్ నగరం నుంచే కాకుండా ఉమ్మడి వరంగల్, నల్గొండ, కరీంనగర్, ఆదిలాబాద్ తదితర జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. కొమురవెల్లి మల్లన్న దర్శనం తర్వాత భక్తులు కొండపోచమ్మను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. జాతరకు వచ్చే భక్తులు ఆలయం వద్ద ఉన్న చెరువులో పుణ్య స్నానమాచరించి అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారికి పసుపు, కుంకుమలతో అలంకరించిన బోనాలను సమర్పిస్తారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి వచ్చే లష్కర్ బోనాలు ఈ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణ. కాగా జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి రవికుమార్ తెలిపారు.


