క్రీడలతో మానసికోల్లాసం
ఎమ్మెల్యే హరీశ్రావు
చిన్నకోడూరు(సిద్దిపేట): క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు మానసికోల్లాసం ఏర్పడుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. మండల పరిధిలోని గంగాపూర్, పెద్దకోడూరు గ్రామాల్లో గురువారం మండల స్థాయి క్రికెట్ టోర్నీ ముగింపు సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ క్రీడలతో స్నేహభావం మరింత బలోపేతం అవుతుందన్నారు. క్రమశిక్షణ పట్టుదలతో క్రీడాకారులు సాధన చేస్తే జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉంటుందన్నారు. యువత చెడు వ్యవసనాలకు వెళ్లకుండా క్రీడల వైపు ఆసక్తి చూపాలన్నారు. చదువుతో పాటు క్రీడలు అవసరమన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. సమావేశంలో మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు.
చైనా మాంజాపై ఉక్కుపాదం మోపాలి
సిద్దిపేటకమాన్: చైనా మాంజాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని ఎమ్మెల్యే హరీశ్రావు కోరారు. సిద్దిపేట పట్టణంలో సంక్రాంతి వేడుకల్లో భాగంగా యువతతో కలిసి హరీశ్రావు గురువారం గాలిపటాలు ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కొత్త ఏడాదిలో అడుగుపెట్టగానే వచ్చే తొలి పండగ సంక్రాంతి అన్నారు. చైనా మాంజా కిల్లర్ మాంజా అని అన్నారు. దీని వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ, గాయాల పాలవుతున్నారన్నారు. చైనా మంజా పట్ల ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలన్నారు.


